టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అజేయ దర్శకుడు కొరటాల శివ కలయికలో వస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. చిరు 152వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 04న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ఇప్పటికే ముమ్మరం చేశారు మూవీ మేకర్స్. ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సినిమా కథనాన్ని కీలకమైన మలుపు తిప్పే పాత్ర అదే అవడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్ర కి సంబంధించిన టీజర్ విడుదల కానున్నది. ఈ నెల 28న ‘సిద్ధసాగా’ పేరుతో ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. అందులో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నదీ మాత్రం మెన్షన్ చేయలేదు. చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘సిద్ధ మరపురాని పాత్ర అవుతుందని, దానికి చాలా కారణాలున్నాయి. పవర్ ఫుల్ టీజర్ వచ్చేస్తోంది.’ అంటూ మెగా అప్డేట్ ఇచ్చారు. ఈ సిద్ద పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.