రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలకు వస్తున్న వరుస కౌంటర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. "తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …" అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. ముఖ్యంగా పేర్ని నాని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ చేసిన సన్నాసి వ్యాఖ్యలపైనా తనదైన శైలిలో ఎదురుదాడి చేశారు. అలాగే ఇతర మంత్రులు, నాయకులు కూడా పవన్ కల్యాణ్పై మూకుమ్మడి దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికీ తన సమాధానం అన్న రీతిలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తాటాకు చప్పుళ్లకు, కుందేలు బెదిరింపులకు భయపడేది లేదు అన్న రీతిలో పవన్ కల్యాణ్ చేసిన తాజా ట్వీట్ ఉందని రాజకీయ వర్గాల వారు, జనసేనాని అభిమానులు అంటున్నారు.