రూ.3వేల కోట్ల వజ్రాలు అమ్మారు?
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రముఖ వజ్రాల తయారీ, ఎగుమతి కంపెనీపై ఈనెల 22వ తేదీ నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కోట్లరూపాయల విలువైన పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు వెల్లడించింది. ఇదొక్కటే కాకుండా ఈ కంపెనీలు టైల్స్ తయారీ వ్యాపారం కూడా చేస్తోంది. ఈరోజు కూడా అధికారులు సూరత్, ముంబయి, నవాసారి, వాంకానేర్ నగరాల్లో దాడులు కొనసాగిస్తున్నారు. రూ.2742 కోట్ల విలువైన వజ్రాలను విక్రయించినట్లు పుస్తకాల్లో నమోదై ఉందని, అలాగేరూ.518 కోట్ల విలువైన మెరుగుపట్టిన చిన్న వజ్రాలను కూడా విక్రయించారని, వీటికి లెక్కలు చూపించలేదన్నారు. నగదు రూపంలో కూడా క్రయవిక్రయాలు జరిగాయన్నారు. బిల్లులను మాయం చేసిన కంపెనీ మోసానికి పాల్పడిందని, అందుకే సోదాలు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు జరిగే సోదాల్లో లభించే వివరాలను బట్టి సోమ, మంగళవారాల్లో కూడా దాడులు నిర్వహించాలా? లేదా? అనేది నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయి లెక్కలు లభించలేదని, వీటన్నింటిన క్రోడీకరిండానికి సమయం పడుతుందన్నారు.