సోనీ పిక్చర్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనం
భారత మీడియా రంగంలో మరో కీలక ఒప్పందం కుదిరింది. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య విలీన ఒప్పందం దాదాపుగా ఖరారైంది. రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడబోయే కొత్త సంస్థలో జీకి 47 శాతం, సోనీకి 53 శాతం వాటాలు దక్కుతాయి. కంటెంట్ క్రియేషన్లో మంచి అనుభవమున్న జీ, క్రీడలు, ఇతర రంగాల్లో అనుభవమున్న సోనీ కలవడంవల్ల దక్షిణాసియాలో ప్రధానమైన మీడియా సంస్థగా నిలవొచ్చని ఆశిస్తున్నాయి. ప్రస్తుతం జీ ఎంటర్టైన్మెంట్ సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదు సంవత్సరాలపాటు సీఈవోగా కొనసాగనున్నారు. ఆర్థికపరమైన అంశాలతోపాటు భవిష్యత్తులో రానున్న విలువను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు జీ వెల్లడించింది. విలీనం తర్వాత ఏర్పడబోయే కంపెనీలో ఎక్కువ మంది డైరెక్టర్లను సోనీ సంస్థే నియమించనుంది. అలాగే ప్రస్తుతం జీ కుటుంబానికి నాలుగు శాతంగా ఉన్న వాటాను 20 శాతానికి పెంచుకోవడానికి కూడా అనుమతిచ్చింది. ఒప్పందం అమలుకు ముందు ఉండే ప్రక్రియ మూడునెలల్లో పూర్తిచేయనున్నారు.