ఈ మద్య మనుషులు చేస్తున్న అకృత్యాలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా పశు, పక్షాదులపై ఏమాత్రం కరుణ చూపించకుండా చేస్తున్న దారుణాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కేరళాలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి ఉదంతం ఎంతో మందికి కంటనీరు పెట్టించింది. తాజాగా తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకేసారి 28 నెమళ్లు మృతి చెందాయి. కొవిల్పట్టి గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట వేశారు. అక్కడ పురుగుల మందు కలిపిన విత్తనాలను నెమళ్లు సేవించడంతో అవి చనిపోయి ఉండొచ్చని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నెమళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు.. నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ఆ నెమళ్లు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో చనిపోయాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పంటలను పక్షులు, మూగజీవాల నుంచి కాపాడుకునేందుకు విత్తనాల్లో పురుగుల మందు కలిపి రైతులు చల్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరింత సమాచారం తెలుసుకోండి: