ఏపీలో భారీ వర్షాలు... భారీ స్థాయిలో నష్టం..!
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఒడిశా మీదుగా కోస్తా జిల్లాల వరకు ఉన్న అల్పపీడనం బలపడడంతో రెండు రోజులుగా ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భారీ వర్షపాతం నమోదు అయ్యింది. అటు ఎగువ నుంచి వస్తోన్న ప్రవాహంతో కృష్ణా, గోదావరి నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి.
తిరువూరులో 170, విశాఖపట్నంలో 100, చోడవరంలో 80, ఉండ్రాజవరం 79, అనకాపల్లి, ఎలమంచిలిలో 60, పెనుగంచిప్రోలు 54 అవనిగడ్డ 50, పెనమలూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలతో 7,010 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైందని అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ పలు మండలాల్లో వేలాది ఎకరాల పంట భూములు ముంపునకు గురయ్యాయి.