రాష్ట్రపతి భవన్ లో కరోనా కలకలం.... పోలీస్ ఉన్నతాధికారికి కరోనా సోకటంతో...?
దేశంలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి రాష్ట్రపతి భవన్ లో కలకలం రేపింది. రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ అధికారి కరోనా భారీన పడినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో భద్రతా సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సదరు అధికారి కార్యాలయం రాష్ట్రపతి గృహానికి సమీపంలోనే ఉండటంతో అధికారులు ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజేషన్ చేసినట్లు తెలిపారు.
అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పని చేస్తున్న ఐపీఎస్ అధికారి రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ఆయనకు పరీక్షలు నిర్వహించగా తాజాగా ఫలితాల్లో కరోనా నిర్ధారణ అయింది. దీంతో పని చేసిన భద్రతా సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. గత నెలలో రాష్ట్రపతి సెక్రటేరియట్ లో పని చేసే ఉద్యోగి కరోనా రోగితో సన్నిహితంగా మెలగడంతో 115 కుటుంబాలను క్వారంటైన్ కు తరలించారు.