బరితెగించిన చైనా సైనికులు.. భారత సైనికులతో ఘర్షణ
మరోసారి చైనా సైనికులు బరితెగించారు. తూర్పు లడఖ్, సిక్కింలలో గత శనివారం వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఘర్షణకు దిగారు. సిక్కింలోని నాకులా సెక్టార్ వద్ద సుమారు 19వేల అడుగుల ఎత్తులో ఉన్న పాస్ వద్ద భారత, చైనా దళాలు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన సుమారు 12మంది సైనికులు గాయపడినట్లు అధికావర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఉన్నతస్థాయి అధికారులు వెంటనే జోక్యం చేసుకుని వారిని అదుపు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
నిజానికి.. ఈ సరిహద్దును అత్యంత సున్నితమైన ప్రాంతంగా అధికారులు చెబుతారు. ఇలాంటి ప్రాంతంలో తరచూ రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని అంటున్నారు. సరిహద్దు సమస్యల కారణంగానే ఈ ఘర్షణ చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. నిజానికి.. చైనా సైనికులు ఘర్షణకు దిగడం ఇదే మొదటిసారి కాదు.. 2017లోనూ రెండు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య కొంతమేరకు ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.