ఏపీ ఘనత : 90 నుంచి 10 వేల కరోనా పరీక్షలు చేసే స్థాయికి..
ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ.. వైరస్ వ్యాప్తిని కచ్చితమైన అంచనా వేసి.. అందుకు అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపడుతోంది. నిజానికి.. మొదట్లో ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి కూడా కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎంత వేగవంతంగా పరీక్షలు చేయగలిగితే.. అంతవేగంగా వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతామని చెప్పారు. అందుకు తగ్గట్టే కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చకచకా చర్యలు తీసుకున్నారు. దానిఫలితంగా రాష్ట్రంలో సొంతంగా కిట్లను తయారు చేయిస్తూనే.. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేకంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించారు. దీంతో ఒక్కసారిగా నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగింది.
దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇలా రోజుకు 90 పరీక్షల స్థాయి నుంచి ఏకంగా పదివేల పరీక్షల స్థాయికి ఎదిగింది ఆంధ్రప్రదేశ్ ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. టెస్టుల్లో అత్యుత్తమ మార్గాలను అనుసరిస్తున్నారని కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ట్రూనాట్, ఆర్టీపీసీఆర్, క్లియా మెషీన్స్ ద్వారా టెస్టులు చేస్తున్నామని, క్లియా టెస్టులు దేశంలో ఏపీలో మాత్రమే జరుగుతున్నాయని కేంద్ర బృందానికి ఏపీ అధికారులు ఈ సందర్భంగా వివరించారు.