తాగాలె.. ఊగాలె.. షాపులకు పోటెత్తిన మందుబాబులు
ఓరి నాయనో..! తీయకతీయక మద్యం షాపులు తీయగానే.. చీమలదండులా మందుబాబులు పోటెత్తారు.. ఈ బారులు చూస్తుంటే.. ఇన్నిరోజుల మందంతా ఈ ఒక్కరోజే తాగేలా ఉన్నారు..! కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు మండే ఎండలో బారులు తీరారు. సుమారు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం దెవుడెరుగు.. నిబంధనలను కాళ్లకింద తొక్కేస్తూ షాపులకు ఎగబడ్డారు.
చత్తీస్ఘడ్లోని రాజ్నంద్గాన్లోని సోమవారం ఉదయం మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ 3.0 నిబంధనలకు మేరకు కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్ఘడ్ రాష్ట్రప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్ షాప్ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు. అలాగే.. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం దుకాణాల ముందు వందలాదిమంది మందుబాబులు బారులు తీరారు. ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.