అభినయంతో అభిమానుల మనసు కొల్లగొట్టిన సంఘవి

Vimalatha
సంఘవి నటి, టెలివిజన్ నటి, మోడల్. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించి అందం, అభినయంతో మంచి క్రేజ్ దక్కించుకుంది అప్పట్లో. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. ఆమె అక్టోబర్ 4న 1977లో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో ఆమె సినిమా ఎంట్రీ జరిగింది. 1993 సంవత్సరంలో తమిళ చిత్రం 'అమరావతి' ద్వారా వెండితెర ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఆమె తొలిసారిగా అజిత్ కుమార్ సరసన నటించింది. ఆ తరువాత సంఘవి తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా మారింది. ఆమె తదుపరి చిత్రం 'రాసిగాన్' కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఆమె విజయ్ సరసన నటించింది. అలా 2 బ్యాక్ 2 బ్యాక్ హిట్‌లతో ఆమె ఓవర్ నైట్ స్టార్‌గా మారింది.
 
ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ఆమె తరువాత కన్నడ చిత్ర పరిశ్రమ నుండి కూడా ఆఫర్లను పొందడం ప్రారంభించింది. 1994 లో 'రాయర మగా' చిత్రం ద్వారా ఆమె కన్నడ చిత్ర రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం ఆమె 'జేమ్స్ జోసెఫ్ గెలీలియో' ద్వారా మలయాళ చిత్రరంగ ప్రవేశం చేసింది. మరుసటి సంవత్సరం సంఘవి తన తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. తద్వారా అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో పని చేసిన అతికొద్ది మంది తారలలో ఒకరిగా మారింది.
 
స్వల్ప వ్యవధిలోనే ఆమె తమిళ, తెలుగు చిత్రాలలో పనిచేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా మారింది. ఆమె 1998 లో హిందీ చిత్రం 'షేర్-ఇ-హిందుస్థాన్' ద్వారా బాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. సంఘవికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1998 లో విడుదలైన బాలీవుడ్ చిత్రం 'జుల్మ్-ఓ-సీతమ్‌'తో మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో మళ్ళీ అటువైపు చూడలేదు. చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంఘవి చివరిగా 2008లో విడుదలైన కన్నడ చిత్రం 'ఇంద్ర'లో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: