గ్రామపంచాయతీలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారని.. ప్రభుత్వం వారితో చర్చలు జరిపి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. గ్రామపంచాయతీ అభివృద్ధి పనులలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర అధికమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించే బదులు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించిందని.. నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ కాలం పూర్తి చేసిన తరువాత వారి ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు.
2022 ఏప్రిల్ 11వ తేదీ వరకు ప్రొబేషన్ కాలం పూర్తి అయ్యిందని, ఆ తరువాత ప్రొబేషన్ పిరియిడ్ను మరొక సంవత్సరం పెంచడం జరిగిందని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ పెంపుదల 2023 ఏప్రిల్ 11వ తేదీకి పూర్తి అయినా నేటికీ వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవడం అన్యాయమని కూనంనేని సాంబశివరావు అన్నారు.