పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కులం పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పేర్లు మార్చేసింది. కులం పేరుతో ఉన్న 56 పాఠశాలల పేర్లను ఆప్ సర్కార్ మార్చేసింది. కులం, వర్గం ఆధారంగా ఉన్న బడుల పేర్లను మార్చాలని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ ఆదేశించిన వారంలోనే అక్కడి అధికారులు అమలు చేసేశారు. కులం పేరుతో ఉన్న పాఠశాలల పేరును ఆయా గ్రామం, స్థానిక నాయకుడు, లేదా అమరవీరుడు లేదా ముఖ్యమైన వ్యక్తి పేరుతో మార్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమానత్వం ఆధారంగా విద్యార్థులకు ఒకే తరహా విద్య అందించాలన్న ఆప్ సర్కార్.. పాఠశాలల పేర్లూ.. ఒక కులానికో, వర్గానికో చెందినవిగా ఉండకూడదని చెబుతోంది. అలా ఉంటే.. విద్యార్థుల్లో అనాగరికులమనే భావన కలుగుతుందని.. ఇది సమాజంలో కుల విభజనకు దారితీస్తుందని అంటోంది. ఆప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.