ఇద్దరు ప్రేమికుల మధ్య చాటింగ్ 185 మందిని ఇబ్బంది పెట్టింది. గుండెళ్లో రైళ్లు పరుగెట్టించింది. ప్రియుడికి ఓ ప్రియురాలి పెట్టిన మెస్సేజ్ కలకలం సృష్టించింది. అసలేమైందంటే.. ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ముంబయి వెళ్లేందుకు మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. ప్రియురాలు బెంగళూరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంది. ముంబయి విమానం రాగానే యువకుడు వెళ్లి కూర్చున్నాడు. ప్రియురాలు తన విమానం కోసం చూస్తోంది. ఇద్దరూ మొబైల్లో చాటింగ్ చేసుకున్నారు. విమానాల్లో భద్రత గురించి సరదాగా చాట్ చేసుకున్నారు.
నువ్వే ఓ బాంబర్ అంటూ ప్రియురాలు సరదాగా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను యువకుడి వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. ఆమె విమాన సిబ్బందికి చెప్పింది. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. అధికారులు విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులందరినీ దించేసి తనిఖీలు చేశారు. చివరకు కేవలం సరదా సంభాషణే అని తేలింది. ఆరు గంటల తర్వాత ఆ విమానం ముంబయి బయలుదేరింది.