తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం మంచి దూకుడు మీదుగా కనిపిస్తోంది. అయితే పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసుకున్న వీపీ సజ్జనార్ ఆర్టీసీలో తన మార్క్ను చూపిస్తూ ఉన్నారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఆర్టీసీని క్రమక్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సజ్జనార్ ఎన్నో వినూతన పద్దతులను అవలంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా పలుమార్లు స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల కష్టాలను తానే స్వయంగా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలోనే కొత్త సర్వీసులను ట్రిప్పులతో సహా ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువలోకి తీసుకొస్తున్నారు.
అయితే సోషల్ మీడియా ద్వారా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఇప్పటికే 364 సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిష్కరించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల నుంచి వచ్చిన పలు వినతులను ప్రత్యేకంగా పరిశీలించి అందులో 151 కొత్త సర్వీసులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త సర్వీసులు ఇప్పటికే 1934 ట్రిప్పులను పూర్తి చేసుకున్నాయి. తక్కువ వ్యవధిలో రవాణా సేవల పునరుద్ధరణలో ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధతను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి ఓ ప్రకటన ద్వారా అభినందించారు. అందులో శభాష్ సజ్జనార్ అంటూ ఉద్యోగులపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.