కరోనా, డెంగ్యూ, ఆంత్రాక్స్.. తర్వాత??
కొవిడ్ మహమ్మారి ప్రపంచ మానవాళిపై ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకుపడింది. మొత్తం తలకిందులైంది. అంటువ్యాధి కావడంతో నిరోధించడానికి మొదట్లో లాక్డౌన్లు ప్రకటించారు. ఆర్థిక కష్టాలు వెంటాడటంతో ఇప్పుడు వాటిని ఎత్తేయడంతో ప్రజలు యథేచ్చగా సంచరిస్తున్నారు. మరోవైపు డెంగ్యూ జ్వరం ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఏపీ, తెలంగాణల్లో డెంగ్యూ రోగ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువవుతోంది. కరోనా బారినుంచి కోలుకున్నవారు కూడా ఆ తర్వాత డెంగ్యూ బారిన పడుతున్నారు. ఈ విషయంలో అప్రమత్తత అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశాయి. మరోవైపు తెలంగాణాలో ఆంత్రాక్స్ వెలుగుచూసింది. గొర్రెలు, మేకల మాంసం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తినకుండా ఉండటం మేలని ఆ రాష్ట్ర పశుసంవర్థకశాఖ సూచిస్తోంది. వరంగల్లో నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ బారిన పడి మరణించాయి.