ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

Chakravarthi Kalyan
కష్టే ఫలి.. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.. ఇలాంటి సూక్తులు రంజిత్ వంటి కొందరిని చూసే ఊపిరిపోసుకుని ఉంటాయేమో అనిపిస్తోంది. సాధించాలన్న పట్టుదల ఉంటే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అయినా ఓ విజేత ఉద్భవిస్తాడేమో అనిపిస్తుంది. అలాంటిదే ఈ రంజిత్‌ రామచంద్రన్ విజయగాథ. ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తరచూ చెప్పేవారు. అమ్మో అది నా వల్ల అవుతుందా.. అనే ఆలోచనే లేకుండా  ముందుకు సాగితే ఫలితం తప్పుకుండా ఉంటుందనే వారు.

ఇప్పుడు ఆ మాటలు ఈ రంజిత్ రామచంద్రన్ కథ వింటే నిజమే అనిపిస్తాయి. రంజిత్ రామచంద్రన్‌ తన విజయగాధను ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు. కేరళకు చెందిన రామచంద్రన్.. పేదరికం కారణంగా పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశారు. ఆయన తండ్రి టైలర్‌.. తల్లి ఉపాధి  కూలీ.. చదువుకునే సమయంలో కాసర్‌గడ్‌లోని పనతుర్‌లో ఉన్న ఒక టెలిఫోన్‌ ఎక్ఛ్సేంజ్‌లో రంజిత్‌ నైట్‌ వాచ్‌మన్‌గా కూడా పని చేశారు. అలా పని చేస్తూనే పీఎస్‌ కాలేజ్‌ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించారు. ఆంగ్లం రాకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  పీహెచ్‌డీ కోర్సు వదిలేద్దామనుకున్నారు. కానీ గైడ్‌ డాక్టర్‌ సుభాష్‌ సహకారంతో కోర్సు పూర్తి చేశారు. సీన్ కట్ చేస్తే రంజిత్ రామచంద్రన్ ఇప్పుడు ఐఐఎం రాంచీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ . నైట్‌వాచ్‌మన్‌గా పనిచేసి, ఆ తరువాత ఐఐటీలో చదువుకుని, ప్రస్తుతం ఐఐఎం రాంచీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కి చేరారు.

తన విజయగాధను ఆయన సోషల్ మీడియాలో వివరించగా మంచి స్పందన లభించింది. రామచంద్రన్ కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్‌తో కప్పిన తన చిన్న గుడిసె ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో 37 వేల లైక్స్‌ వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: