రాయలసీమ గుత్తివంకాయ కూర ఎప్పుడైనా తిన్నారా ? ఎంత రుచిగా ఉంటుందో తెలుసా ? ఎంత బాగా ఉంటుందో తెలుసా ? అసలు సిసలైన రాయలసీమ కారంతో పల్లీల పొడి, మసాలా వేసి చేస్తే ఎంతబాగుంటుందో తెలుసా.. అలాంటి రాయలసీమ రుచిని మనం కేవలం ఒక్క రాయలసీమలోనే తినగలం. ఆలా తినాలి అనుకునే వారు అది ఎలా చెయ్యాలో.. ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు..
వంకాయలు - పావుకిలో,
చింతపండు - నిమ్మకాయ సైజు,
నూనె - తగినంత,
ఉల్లిపాయ - ఒకటి,
దాల్చిన చెక్క- ఒకటి,
కారం - ఒక టీ స్పూను,
ధనియాల పొడి - ఒక టీ స్పూను,
వెల్లుల్లి రేకలు - నాలుగు,
నెయ్యి - రెండు టీ స్పూన్లు,
నువ్వులు - 30 గ్రాములు,
పల్లీలు - 30 గ్రాములు,
ఉప్పు - తగినంత,
మెంతులు - అర టీ స్పూను,
కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారీ విధానం...
స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి కాగాక దాల్చిన చెక్క, వెల్లుల్లి ముక్కలు, పల్లీలు, నువ్వులు, వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోని పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కోసిన వంకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టి స్టౌ మీద గిన్నె పెట్టుకొని సరిపడా నూనె పోసి బాగా కాగాక కరివేపాకు, మెంతులు వేసి వేయించుకోవాలి. తరువాత వంకాయలను కూడా వేసి బాగా వేయించాలి. కొద్ది సేపు నూనెలో మగ్గాక చింతపండు రసాన్ని వేసి ఉడికించాలి. అంతే రాయలసీమ వంకాయ కూర రెడీ.