ఏపీ: అనకాపల్లిలో ఘోర ప్రమాదం..పెరుగుతున్న మృతుల సంఖ్య..!

FARMANULLA SHAIK
అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి భవనం కూలిపోగా.. దాని శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని చనిపోయి ఉంటారని.. అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు అచ్యుతాపురం సెజ్‌లో చంద్రబాబు పర్యటించనున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్‌ పేలింది. భారీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో కాలిన గాయాలతో ఏడుగురు మృతిచెందగా.. మొదటి అంతస్తు శ్లాబు కిందపడటంతో ఏడుగురు మరణించారు. గాయపడిన వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
 

ఇక ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేటే లిమిటెడ్‌లో జరిగిన ఈ ప్రమాద తీవ్రత చూస్తే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే వాదన వ్యక్తం అవుతోంది. ఈ కంపెనీలో వందలాది మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే కంపెనీలో లంచ్ బ్రేక్‌లో ఈ భారీ పేలుడు సంభవించడంతో.. మరింత ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్లు అయిందని ఫ్యాక్టరీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రియాక్టర్ పేలుడు ధాటికి.. భారీగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగ కమ్ముకోవడంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని.. ఇక పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడి ఛిద్రమైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు.. రియాక్టర్ పేలుడు కారణంగా వచ్చిన శబ్దంతో.. ఆ కంపెనీలో ఉన్న కార్మికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బయటికి పరుగులు తీసినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. ఇక ఈ భారీ శబ్దానికి పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 11 ఫైర్ ఇంజిన్‌లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. ఇక గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.రియాక్టర్‌ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ తెలిపారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. సంఘటనా స్థలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. మృతుల వివరాలు తెలిసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: