ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసిన సాధారణ రైతు.. ఒక్కసారి చార్జ్ చేస్తే..

yekalavya
భువనేశ్వర్: రైతులు వ్యవసాయం చేయాలి. పంట పండించాలి. మట్టిలో దిగి నాట్లు వేయాలి. పొలానికి నీళ్లు పెట్టడం, ఎరువులు చల్లడం వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలి. అయితే ఓ రైతు ఏకంగా ఎలక్ట్రిక్ కారునే తయారు చేస్తే..? నమ్మలేకపోతున్నారు కదా..? కానీ ఇది నిజం. ఒరిస్సాకు చెందిన ఓ రైతు ఈ అరుదైన ఆవిష్కరణ చేశాడు. తన క్రియేటివిటీకి పదును పెట్టి మరీ దీనిని తయారు చేశాడు. ఈ ఒక్క ఆవిష్కరణతో ఇప్పుడు అతడు దేశ వ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఒరిస్సా వ్యాప్తంగా అతడి ఆవిష్కరణ గురించే మాట్లాడుకుంటున్నారు.
కరోనా దెబ్బకి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఇళ్లలో ఉండలేక విసుగెత్తిపోయారు. అయితే కొంతమంది మాత్రం ఖాళీగా కూర్చోలేక తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. ఒడిశాలోని మథూర్‌భంజ్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ కూడా అలాంటి ఓ చిన్న ప్రయోగమే చేసి అతి పెద్ద ఆవిష్కరణ చేశాడు. స్వతహాగా రైతు అయిన అగర్వాల్.. దేశీయ పరికరాలతో నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశాడు. పైగా ఈ వాహనం ఎలక్ట్రిక్ బ్యాటరీతోనే కాకుండా సోలార్ ఎనర్జీతో నడిచేలా ఈ వెహికల్‌ను డిజైన్ చేశాడు.
ఇక ఈ వాహనంలో సుశీల్.. 850 వాట్ల మోటార్, 100ఎహెచ్/54 ఓల్ట్స్ బ్యాటరీని అమర్చాడు. పెట్రోలు ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు చక్కటి ప్రత్యామ్నాయమని, అందుకే ఈ ఆలోచన చేశానని సుశీల్ చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ బ్యాటరీ సుమారు 8 గంటలలో పూర్తిగా ఛార్జ్ అవుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం వరకూ నడుస్తుందని సుశీల్ చెబుతున్నాడు.
 అలాగే ఈ బ్యాటరీ 10 ఏళ్ల పాటు పనిచేస్తుందని వివరించాడు. ప్రస్తుతం ఈ ఒక్క ఆవిష్కరణతో సుశీల్ పేరు స్థానికంగా విపరీతంగా వినిపిస్తోంది. తమ గ్రామానికి చెందిన రైతు ఇలాంటి ఆవిష్కరణ చేయడం తమకు కూడా ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: