అద్భుతమైన టెక్నాలజీ ఫోన్లకు సుపరిచిత చిరునామా అయిన ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ విషయంలో వస్తున్న అభ్యంతరంపై వినియోగదారులకు తీపికబురు వినిపించింది. ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేయగా...ఫోన్లు స్విచాన్ కావడం లేదని పలువురు వినియోగదారులు ఆపిల్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. అందుకు స్పందించిన ఆపిల్ ఆయా ఫోన్లను ఉచితంగా రిపేర్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలో నో పవర్ సమస్య కారణంగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. 2018 అక్టోబర్ నుంచి 2019 ఆగస్టు మధ్య తయారైన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలోనే ఈ సమస్య వస్తుందని ఆపిల్ తెలిపింది. కనుక వారికి మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నామని ఆపిల్ తెలియజేసింది. పైన తెలిపిన ఆ ఐఫోన్లు ఉన్న వారు ఆ సమస్యను ఎదుర్కొంటుంటే తమ ఫోన్లను ఈ ఆఫర్ కింద ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చో, లేదో కూడా తెలుసుకోవచ్చని.. ఆపిల్ తెలిపింది. ఇక వినియోగదారులు ఈ ఆఫర్ గురించి https://support.apple.com/en-in/iphone-6s-6s-plus-no-power-issues-program అనే సైట్ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని వివరించింది.
2016లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్స్లో ఐఫోన్ 6ఎస్ తొలి స్థానంలో నిలిచింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7లు వరుసగా ఐదు, తొమ్మిది ర్యాంకుల్లో నిలిచాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక 2016లో టాప్ టెన్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్స్ జాబితాలో సామ్సంగ్ మోడల్స్ ఐదు స్థానాలు ఆక్రమించడం విశేషం. ఇందులో చైనీస్ మోడల్ ఒప్పో కూడా నిలిచింది.