WPL ఎలిమినేటర్: ఫైనల్ లో అడుగు పెట్టేది "ముంబైనా ... యూపీ నా" ?

VAMSI
గత ఇరవై రోజులుగా ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి దశకు వచ్చేసింది. బీసీసీఐ మొదటి సీజన్ ను కేవలం 5 జట్లతోనే స్టార్ట్ చేసింది. ఈ జట్లలో నాలుగు జట్లు ఐపీఎల్ లో కొనసాగుతుండగా ఒక్క జట్టు మాత్రమే వేరేగా ఉంది. ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు , గుజరాత్ జెయింట్స్ మరియు యూపీ వారియర్స్ లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ లీగ్ నియమ నిబంధనల ప్రకారం ఉత్తమ ప్రదర్శన చేసిన మూడు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కు వెలుతాయి, అంతే కాకుండా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు మాత్రం డైరెక్ట్ గా ఫైనల్ కు చేరుకుంటుంది.
ఆ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్ళగా , ప్లే ఆఫ్ స్టేజ్ లో ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ మరియు యూపీ వారియర్స్ లు తలపడనున్నాయి. ఇక రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు మరియు గుజరాత్ జెయింట్స్ జట్లు మాత్రం ఇంటిదారి పట్టాయి. కాగా ఈ రోజు నావి ముంబైలోని డి వై పాటిల్ స్టేడియం లో ఈ రెండు జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన యూపీ వారియర్స్ కెప్టెన్ అలీసా హీలీ తెలివిగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా యూపీ కే ఉన్నాయని చెప్పాలి.
యూపీ వారియర్స్ లో కెప్టెన్ అలీసా హీలీ , ఆల్ రౌండర్ మెక్ గ్రాత్ , కిరణ్ , దీప్తి శర్మ , ఎక్లస్టన్ , హరీష్ లు కనుక అంచనాలకు తగిన విధంగా రాణిస్తే విజయం ఏమీ కష్టం కాదు. కానీ ముంబై ఇండియన్స్ లో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడం వారికి కలిసి వచ్చే అంశం. మరి ఈ లీగ్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న ముంబై బ్యాటర్ లు భాటియా , మాత్యుస్, హర్మన్ ప్రీత్ కౌర్ మరియు నటాలీ సీవర్ లను ఏ విధంగా యూపీ బౌలర్లు అడ్డుకుంటారో చూడాలి. ఈ రెండు టీం లలో ఎవరు గెలిచి ఫైనల్ లో ఢిల్లీ తో తలపడతారో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: