ఇండోర్ వేదికగా భారత్ -శ్రీలంక ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 లో భారత బౌలర్లు విజ్రభించడం తో శ్రీలంక నిర్ణీత 20ఓవర్ల లో 9వికెట్ల నష్టానికి 142పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న భారత బౌలర్లను ఎదుర్కోవడం లో లంక బ్యాట్స్ తడబడ్డారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్ , నవదీప్ సైని వారికీ చుక్కలు చూపెట్టారు.
టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. దూకుడుగా ఆడుతున్న ఆవిష్క ఫెర్నాండో ను సుందర్ బోల్తా కొట్టించడం తో లంక వికెట్ల పతనం స్టార్ట్ అయ్యింది. అయితే కుశాల్ పెరెరా 34పరుగుల తో కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈక్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో భారీషాట్ కు యత్నించి లాంగ్ ఆన్ లో ఫీల్డర్ కు దొరికిపోవడం తో అతని పోరాటం ముగిసింది. ఇక అక్కడినుండి శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే చివరి ఓవర్ లో హసరంగా చివరి మూడు బంతులను బౌండరీలకు తరలించడం తో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. భారత బౌలర్ల లో శార్దూల్ ఠాకూర్ 3, సైని 2, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా సుందర్ , బుమ్రా తలో వికెట్ తీశారు.