టీ 20 క్రికెట్ వచ్చాక టెస్టు క్రికెట్ కు గతంలో వున్న ఆదరణ కరువైంది. మారుతున్నకాలం తోపాటు 5రోజుల టెస్టు మ్యాచ్ ను చూడడానికి క్రికెట్ అభిమానులు ఉత్సాహం చూపించడం లేదు. దాంతో టెస్టు క్రికెట్ కు ఆదరణ తేవడానికి ఐసీసీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొత్తగా డే/ నైట్ టెస్టులను అలాగే ఎర్ర బంతి తో పాటు గులాబీ బంతి తో టెస్టు మ్యాచ్ లను ప్రవేశ పెట్టింది. వీటితో పాటు ఇటీవల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కూడా తీసుకొచ్చింది.
ఇక ఇప్పుడు టెస్టులను 5రోజులకు కాకుండా దేశవాళీ తరహాలో నాలుగు రోజులకు పరిమితం చేయాలనీ ఐసీసీ యోచిస్తోంది. వచ్చే 2023 ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లను తప్పనిసరి చేసేలా సన్నాహాలు చేస్తుంది. 2018 నుండి 60శాతం టెస్టు మ్యాచ్ లు నాలుగు రోజుల్లోనే ముగిశాయి.దాంతో ఐసీసీ తాజాగా నాలుగు రోజుల మ్యాచ్ లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ల్లో ఓవర్ల కోటాను రోజుకు 90నుండి 98కి పెంచనుంది.
ఇక ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లు గతంలో రెండు సార్లు జరిగాయి. 2017లో దక్షిణాఫ్రికా , జింబాబ్వే జట్ల మధ్య తొలి సారి ఈ మ్యాచ్ జరుగగా గత ఏడాది ఇంగ్లాండ్ , ఐర్లాండ్ లమధ్య కూడా ఈ తరహా టెస్టు మ్యాచ్ జరిగింది. వచ్చే సమ్మర్ లో ఆస్ట్రేలియా , ఆఫ్ఘనిస్థాన్ తో సొంత గడ్డపై నాలుగు రోజుల టెస్టు ను ఆడే అవకాశాలు వున్నాయి.