కాణిపాక వినాయకా.. మజాకా...సత్య ప్రమాణానికి ధైర్యం ఉండాల్సిందే.!

* సత్య ప్రమాణాల స్వామిగా గుర్తింపు.!
* బ్రిటిష్ కోర్ట్ లో సైతం కాణిపాక ప్రమాణానికి ఎంతో విలువ.!
* విహారిపురి-కాణిపారకరం-కాణిపాకంగా పేరు మార్పు.!
* మతసామరస్యానికి అతీతంగా పూజలు.!
(చిత్తూరు-ఇండియాహెరాల్డ్): 'కాణిపాకం'...చిత్తూరు జిల్లా ఐరాల మండలం లోని ఒక గ్రామం. ఈ పుణ్యక్షేత్రం బహుదానది ఉత్తరాన తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిలో చిత్తూరుకి పన్నెండు కి.మీ దూరంలో ఉంది.ఈ ఊరు నాలుగింట మూడవవంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది.అక్కడ వెలిసి ఉన్న దేవాలయల్లో ఒకటైన వరసిద్ధివినాయక దేవాలయం సత్య ప్రమాణాలకు నెలవుగా..అసత్యాలు చెప్పే వారికి సింహ స్వప్నంగా ఎంతో ప్రముఖ్యాన్ని సంపాదించుకుంది. సర్వమత ఆరాధ్యుడిగా పూజలు అందుకుంటున్న ఈ వినాయకస్వామికి హిందువులే కాక ఇతర మతస్తులు కూడా మొక్కులు తీర్చుకుంటుంటారు.ముఖ్యంగా స్వామి వారి దర్శనార్థం ఎక్కువ సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనబడుతుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్తులు అధిక సంఖ్యలో కనబడతారు.ఈ దేవాలయం పదకొండవ శతాబ్ద ప్రారంభంలో చోళ రాజు మొదటి కుళుత్తుంగ చోళుడు నిర్మించాడు.1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేసారు.ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధ్వర్యంలో ఉంది. ఈ దేవాలయ నిర్వహణ కొరకు పదిహేను మంది సభ్యులతో కూడిన ట్రస్టీ ఉంది.వినాయక చవితి పండగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు.
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు  కాణిపాకంలో ప్రమాణం చేద్దామా? అంటూ సవాల్ విసురుతారు. దీన్నిబట్టి తెలుస్తుంది స్వామివారి మహిమ ఎలాంటిదో అని ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.
చారిత్రిక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూచాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: