గుడిలో గంటను ఎందుకు కొడతారో తెలుసా.. ?
భగవంతుడు ముందు గంట కొట్టడం వలన ఆ శబ్ధం ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తుల, నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటుంటారు. అంతే కాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్నీ శుభాలకు సంకేతం అని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ, ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజలలో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుక భాగంలో సరస్వతి దేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు. అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షగా దర్శించాలి అని పూజారులు చెబుతుంటారు.