ఆంజనేయం: మంగళవారం నాడు హనుమంతుడిని ఇలా పూజిస్తే.. ఎన్నో లాభాలు..!
హనుమంతుడు చిరంజీవుడు, ఆరోగ్య, శత్రు పీడ, దిష్టి దోషాలని ఒక్క దెబ్బతో పటాపంచలు చేస్తాడు. అందుకే హనుమంతుడు.. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. అయితే హిందూ దేవుళ్లు, దేవతల్లో ఒక్కొక్కరినీ ఒక్కో రోజు భక్తులు పూజిస్తారని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హనుమంతున్ని భక్తులు పూజిస్తారు. మరి మంగళవారం నాడు హనుమంతుడిని ఎలా పూజిస్తే మనకి మన కుటుంబానికి అన్ని ఆరోగ్య సమస్యలు పోయి కుటుంబం సంతోషంగా భోగ భాగ్యాలతో కళకళలాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానమాచరించి..శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆపై ఎనిమిది రేకుల తామర పుష్పాన్ని పూజవద్ద వుంచాలి. ఎరుపు రంగుతో కూడిన ఆహార పదార్థాలను అంటే కేసరిబాత్ను నైవేద్యంగా సమర్పించి.. పూజను ముగించాలి. అలాగే మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ను పూజించాలి. ఇలా ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా హనుమంతుడు ప్రీతి చెందుతాడు. 9 వారాల పాటు ఇలా మంగళవారం వ్రతమాచరించి.. హనుమంతుడిని పూజించాలి.
రజోగుణ సంబంధమైన మసాలా, నాన్వెజ్, ఉల్లి, వెలుల్లి, తదితర పదార్థాలను తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. దీంతో శుభం కలుగుతుంది. సమస్యలు తొలగిపోతాయి. మరియు మంగళవారం రోజున ఆంజనేయస్వామికి పూజ చేసి ఉపవాసం ఉండే దంపతులకు పిల్లలు త్వరగా పుడతారట. దోషాలు, దుష్ట శక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారట. అయితే రాత్రి పూట ఉప్పు లేని ఆహారాన్ని తినాలట. అదేవిధంగా.. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతున్ని పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగు పడుతుందట.