రహస్యం: బ్రహ్మను ఎందుకు పూజించరో తెలుసా..?

హిందువులకు అత్యంత పవిత్రమైన దేవతలు త్రిమూర్తులు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు.. ఈ ముగ్గురిలో విష్ణు, మహేశ్వరులకు చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్నో పూజలు ఉన్నాయి. కానీ బ్రహ్మకు పూజలు ఉండవు. ఆలయాలు ఉండవు.. ఎందుకంటే..


ఒకనాడు బ్రహ్మవిష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరింది. ఆ వాదానికి విరుగుడుగా, శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటాననీ, ఎవరైతే ఆ లింగపు అంచుని చేరుకోగలుగుతారో వారు గొప్పవారన్నదే ఆ పరీక్ష సారాంశము. ఆ పరీక్షకు బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా సరేనన్నారు.


పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆద్యంతరహితమైన ఒక లింగరూపంలో వెలిశాడు. అంతట బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగాకారపు పైభాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలని తవ్వుకుంటూ లింగపు అడుగుభాగాన్ని చేరుకునేందుకు సిద్ధపడ్డాడు.ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనేలేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమిని ఒప్పుకోవడం ఏమిటన్న అహంకారం కలిగింది బ్రహ్మదేవునిలో. దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు.


అంతేకాదు! తన మాట నిజమేనంటూ ఒక మొగలిపూవు (కేతకి) చేత కూడా సాక్ష్యం చెప్పించాడు. కానీ లయకారుడైన శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. పైగా తననే భ్రమింపచేయాలని చూసినందుకు ఆ పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది. అంతే! శివుని మూడో కంటికి బ్రహ్మకు ఉన్న ఐదో తల భస్మమైపోయింది. పైగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన దైవమే అబద్ధాన్ని పలకడంతో, ఇకమీదట బ్రహ్మ పూజలందుకునే అర్హతను కోల్పోతాడంటూ శపించాడు శివుడు. అప్పటి నుంచి బ్రహ్మకు పూజలు లేవు. ఆలయాలూ లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: