WPL 2023: ముంబైతో బెంగుళూరు "ఢీ".. పైచేయి ఎవరిదో ?

VAMSI
ఇండియాలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ తో మరోసారి ఐపీఎల్ ను ఎంతగానో అభిమానించే ప్రేక్షకులకు పండుగా వచ్చిందని చెప్పాలి. మార్చి 31 వ తేదీ నుండి ఐపీఎల్ సీజన్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అందరి దృష్టి ఈ మహిళల ఐపీఎల్ మీదనే నెలకొంది. ఈ లీగ్ లో కేవలం అయిదు జట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి కాగా ... రెండు మ్యాచ్ లు ఏకపక్షముగా సాగినా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ అసలైన క్రికెట్ మజాను రుచు చూపించింది.
ఈ రోజు సాయంత్రం 7 .30 గంటలకు ఇండియా మహిళల జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు మరియు ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందన్న కెప్టెన్ గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేకున్నా... మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టునే విజయం వరిస్తుంది. ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ లో గుజరాత్ జాయింట్స్ ను భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరపున హీలీ మాత్యుస్, హర్మన్ ప్రీత్ కౌర్ మరియు నటాలీ సివర్ లు రాణించి మొదటి విజయాన్ని అందించారు.
మరోవైపు బెంగుళూరు జట్టు మాత్రమే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కాగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికను తెరవాలని స్మృతి మందన్న సేన బరిలోకి దిగనుంది. ఇక ఈ టీం లో మందన్న, డివైన్ , పెర్రీ , రిచా ఘోష్ లు అంచనాలకు తగిన విధంగా ఆడితే వీరి విజయం సులభమే. కానీ ముంబై జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా మాత్యుస్, నటాలీ సివర్, కౌర్ మరియు అమేలియా కర్ లు ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. మరి సమఉజ్జీలుగా ఉన్న రెండు జట్ల మధ్యన జరగనున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో  చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: