టీమిండియా వైస్ కెప్టెన్‌గా అతడే కరెక్ట్.. భారత మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2-0తో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ప్రస్తుతం కొందరు టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. మరో వైపు కొందరు ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో జట్టు కూర్పుపై ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. మూడో టెస్టుకు జట్టును ప్రకటించినప్పటికీ, వైస్ కెప్టెన్‌ పోస్టును ఖాళీగా ఉంచారు. దీంతో తుది జట్టులో కూడా కేఎల్ రాహుల్ ఉండేది అనుమానమే అని అంతా పేర్కొంటున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ జట్టులోకి రావొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్ భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సరైనోడు అనే కామెంట్లు చేశారు.
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మార్చి 1-5 తేదీల వరకు జరగనుంది. ఈ తరుణంలో జట్టు వైస్ కెప్టెన్‌ పోస్టు ఖాళీగా ఉంచారు. దీనికి ఎవరిని ఎంపిక చేస్తారోననే ఉత్కంఠ సాగుతోంది. కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. అయితే సబా కరీం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ స్థానానికి ఎప్పటికైనా సరైన వ్యక్తి పంత్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 'తదుపరి వైస్ కెప్టెన్‌ని ఎన్నుకునేటప్పుడు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి. వయస్సు మొదలైనవి పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆ వ్యక్తి భారతదేశానికి భవిష్యత్తులో నాయకత్వం వహించాలి. ప్రస్తుతం, రవీంద్ర జడేజా మరియు రిషబ్ పంత్ ఇద్దరూ వైస్ కెప్టెన్ పోస్టుకు పోటీదారులుగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కానీ జడేజా ఎంతో కాలం క్రికెట్ ఆడకపోవచ్చు. అతడికి పనిభారం కూడా కావొచ్చు.  పంత్‌కు ఎదురైన ప్రమాదం తర్వాత మళ్లీ ఫిట్‌నెస్ సంతరించుకోవడం కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తోంది' అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: