ఐరన్ బాక్స్, హెయిర్ డ్రైయర్లు .. పిచ్ ను ఇలా కూడా ఆరబెడతారా ?
గువహటి వేదిక గా ఆదివారం ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మొదటి టీ 20మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. టాస్ వేశాక కాసేపటికే వర్షం కురవడం ప్రారంభమైంది. అయితే అప్పటికే పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు కానీ ఆ కవర్ల గుండా నీరు లీక్ కావడంతో పిచ్ పూర్తిగా తడిసిపోయింది. దాంతో పిచ్ ను ఆరబెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
అయితే ఆ క్రమంలో ఎన్నడూ లేని విధంగా హెయిర్ డ్రైయర్లు, ఐరన్ బాక్స్ , వాక్యూమ్ క్లీనర్ లతో పిచ్ ను ఆరబెట్టే ప్రయత్నం చేయడమే భారత క్రికెట్ అభిమానులను ఆశ్ఛర్య పరిచింది. ఏడాదికి 1000కోట్ల కు పైగా ఆర్జిస్తున్న బీసీసీఐ ..స్టేడియం లో సరైన సదుపాయాలను కల్పించలేకోపోయింది. సాధారణ వర్షం పడితే కూడా మ్యాచ్ ను నిర్వహించే ఏర్పాట్లు చేయలేదంటూ ట్విట్టర్ లో బీసీసీఐ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
శ్రీలంక క్రికెటర్లు మీరు వచ్చే టప్పుడు ప్రేమదాస స్టేడియం కవర్స్ ను కూడా తీసుకొచ్చుకోవాల్సిందని ఓ అభిమాని కామెంట్ చేయగా హెయిర్ డ్రైయర్ తో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ ను ఆరబెట్టుకోవాల్సిరావడం సిగ్గుగా వుంది. బీసీసీఐ.. సంపాదనంతా ఏ చేస్తుంది అని మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ నిర్వహణ లో అస్సాం క్రికెట్ అసోసియేషన్ చేతులెత్తేయడం తో బీసీసీఐ దీనిపై విచారణ జరుపనుంది.