శ్రీవారి దర్శనానికి భక్తులు సిద్ధం - టీటీడీ సంశయం!

N.Hari
తిరుమల సప్తగిరులపై స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కానీ శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్న భక్తులందరికీ టీటీడీ అవకాశం కల్పించడం లేదు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తోంది. మరోవైపు కష్టకాలంలో స్వామి వారిని దర్శించుకుని స్వాంతన పొందాలని కోరుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి నెలా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గు ముఖం పడుతున్నా... కొన్నిచోట్ల ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయిందని, మరికొన్ని చోట్ల థర్డ్‌ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ దర్శనాల సంఖ్యను పెంచడం లేదు. ప్రతి నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన ఐదు వేల మంది భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. దీంతోపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వర్చువల్‌ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు అందించిన భక్తులు.. ఇలా నిత్యం 15 వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. అయితే అంతకుమించి భక్తులు స్వామవారి దర్శనానికి పరితపిస్తున్నారు.
ఆగస్టు మాసానికి సంబంధించిన ఈ నెల 20వ తేదీన టీటీడీ ఆన్‌లైన్‌లో 1,35,000 టికెట్లను విడుదల చేయగా.. గంట వ్యవధిలోనే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్ధితి లేదు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శన సమయంలో కూడా ఇంతటి స్థాయిలో భక్తుల నుంచి డిమాండ్ ఉన్న పరిస్ధితి లేదు. గత ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్ష టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచితే.. రెండు రోజులపాటు భక్తులకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం నెల రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేసిన గంటలోనే భక్తులు వాటిని కొనుగోలు చేయడం.. స్వామివారి దర్శనం కోసం భక్తులు పడుతున్న తాపత్రయానికి నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తంమీద మునుప్పెన్నడూ లేని విధంగా శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. అయితే టీటీడి మాత్రం స్వామివారి దర్శనాలు పెంచేందుకు నిరాకరిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దర్శనాల సంఖ్యను పెంచే అలోచన లేదని, ఇంకొంత కాలం యథాస్థితిని కొనసాగిస్తామని ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇంకా రెండు నుంచి మూడు నెలలపాటు శ్రీవారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: