డైరెక్ట్‌గా సీన్‌లోకి జగన్.. అటోఇటో తేలిపోతుందా..?

Chakravarthi Kalyan
ఏపీలో కొన్నిరోజులుగా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. పీఆర్సీ సహా అనేక సమస్యలపై పోరాడుతున్నాయి. పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రధాన డిమాండ్‌.. ఇప్పటికే 27 శాతం ఐఆర్ ప్రకటించినా.. ఫిట్‌మెంట్‌ మాత్రం 15 శాతంలోపే సిఫార్సు చేసింది సీఎస్‌ కమిటీ. ఈ రిపోర్టుపై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఆందోళలు చేస్తున్నాయి. ఉద్యోగులు కోరినంత కాకపోయినా వారిని సంతృప్తి పరుస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నేరుగా సీఎం రంగంలోకి దిగబోతున్నారు.

సీఎం జగన్‌ సీన్‌లోకి రావడంతో పీఆర్సీ అంశం తుది దశకు చేరుకుంది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో  నేడు సీఎం జగన్  కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై సమావేశంలో చర్చిస్తారు. మొత్తం 71 డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే  నోటీసు ఇచ్చాయి.
 
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తొలుత చర్చలు జరపనున్న సీఎం.. ఆ తర్వాత ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ విషయాన్ని ఖరారు చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ రద్దు హామీపైనా  సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే కీలకమైన ఫిట్‌ మెంట్ అంశాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంలో ఉద్యోగుల ఆశలకు.. ప్రభుత్వం ప్రతిపాదనలకూ పొంతనలేకుండా ఉంది.

మరి ఉద్యోగ సంఘాలను తాము అనుకున్న ఫిట్‌మెంట్‌ కు ఒప్పించడం కష్టమే. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో పీకల్లోతు కూరుకుపోయినట్టు కనిపిస్తున్న ప్రభుత్వానికి ఈ ఫిట్‌మెంట్‌ భారం ఎంత తగ్గితే అంత మేలు అన్న భావన ప్రభుత్వానికి ఉంది. అయితే.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆదాయాలు పడిపోయిన విషయాన్ని కన్విన్సింగ్‌గా చెప్పి ఒప్పిస్తారా.. లేక.. ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గి ఖజానాపై మరింత భారం వేసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: