వ్యంగ్యం : జగనన్న ఇలాకా.. నో కానుక
పండుగకు కానుకలు ఇస్తే బాగుంటుంది కానీ ఆయన ఇవ్వరు. ఈ సారి కూడా పప్పు బెల్లాలు అయ్యవార్లకు లేవనే తేలిపో యింది. అయినా పండుగ చేసుకునేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే గొప్ప వరం అని భావిస్తున్నారు కొందరు. మండపాల ఏర్పాటుకు ఆయన సమ్మతి తెలపడం ఎందరికో ఆనందం ఇచ్చింది. కానీ పీఆర్సీ పై మాత్రం మౌనంగానే ఉన్నారాయన. అదేవిధంగా సీపీఎస్ రద్దుపై కూడా మౌనంగానే ఉండిపోయారు. ఆదాయం వెతికించే పనిలో నేనున్నాను కదా!
మీరెందుకు డిస్ట్రబ్ చేస్తారు అన్న విధంగా కూడా ఉన్నారు ఆయన. అందుకే ఆయన ఈ సారి కొత్త పీఆర్సీ లేదనే తేల్చారు. బద్వేలు ఉప ఎన్నికలకు మాత్రం ప్రియమయిన ముఖ్యమంత్రి 130కోట్లు కేటాయించి ఓటరుపై ప్రేమ చాటుకున్నారు. కనుక మనం ఉప ఎన్నికలు ఉన్న ఏరియాకు పోతే మేలు ఏమయినా జరగవచ్చు అన్నది చాలా మంది అభిప్రాయంగా వినిపిస్తున్న మాట. ఆ మాట విన్నాక జగన్ సర్ కూడా నవ్వుకున్నారు నా వైపు ఓ సారి చూసి.. ఏమయ్యా! ఇక్కడేదీ రహస్యం కాదు అని నీకు తెలియదా అన్న విధంగా! తప్పదు! తప్పు లేదు! తప్పు ఎంచేందుకు వీల్లేదు! ఓకేనా!డియర్ ఓటరా!
జగనన్న అధికారంలో వచ్చాక పండుగకు కనీసం కానుకలే లేకుండా చేశాడు అన్న బాధ రేషన్ కార్డుదారుల్లో ఉంది. ఇంకొందరికి జీతం మారలేదన్న వేదనతో ఇంటికి వచ్చాక కూడా చాకిరీ చేయాల్సి వస్తుందన్న బాధ ఉంది. ఇన్ని జరిగినా పీఆర్సీ మాత్రం కొత్త పద్ధతి ప్రకారం అమలు చేయకపోయినా, పైకి నోరెత్తలేని బండి శ్రీనుపై ఉద్యోగులకు అసంతృప్తత ఉంది. బండి శీను కూడా ఎక్కడా నోరెత్తలేకపోతున్నందుకు చాలా ఫీలయిపోతున్నాడని కూడా సమాచారం ఉంది. ఎంత జరిగినా ఎంత చేసినా కూడా జగన్ మాత్రం బాబు రూట్లో వెళ్లడం లేదు. అంటే సంక్రాంతికి కానుక, క్రిస్మస్ కు కానుక, రంజాన్ కు తోఫా ఇవ్వడం లేదు. ఎందుకంటే అంత డబ్బు కానీ అవసరం కానీ తన దగ్గర లేవన్నది ఆయన ఫీలింగు. ఈ ఫీలింగు కారణంగానే ఆయన ఎవ్వరికీ ఏ కానుక కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. తీసుకునేందుకు మాత్రం సిద్ధంగానే ఉన్నారు.
ఇక ఆయుధ పండుగ అయిన దసరా అదేలేండి అల్లుళ్ల పండుగ అయిన దసరా సందర్భంగా ఇంకేమయినా తాయిలాలు ఇచ్చే అవకాశం ఉందో లేదో అని వెతుకుతున్నారట అధికారులు. మీరు కొత్త అప్పులు తెండి నేను మీ వాటా మీకు తప్పక ఇస్తాను జీతం మరియు భత్యం రూపంలో అని కూడా అంటున్నారట ప్రియ ముఖ్యమంత్రి.