దేశం సురక్షిత హస్తాల్లోనే ఉందని మీకు హామీ ఇస్తున్నా ప్రధాని అని మోడీ అన్నారు. మాతృదేశంపై ఒట్టేసి చెబుతున్నా.. దేశాన్ని ఎవరి ముందు తలదించనివ్వను అని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ మట్టి సువాసనలు గుండెల్లో నింపుకున్న జాతి మనదని చెప్పారు. ఈ దేశానికి నేను భరోసా ఇస్తున్నా. జాతి ఖ్యాతి విరాజిల్లేలా మన జెండా సగర్వంగా ఎగిరేలా మనం నిలబడతాం. ఈ మట్టిలోనే పౌరుషం ఉంది. మన ప్రతాపాన్ని చాటుదాం. యావత్ జాతికి ఇదే మాట ఇస్తున్నా.. అని చెప్పారు.
వీర జవాన్ల స్మృతిలో భాగంగానే నేషనల్ వార్ మోమోరియల్ జాతికి అంకితం చేశామని ప్రధాని మోదీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, పాకిస్థాన్ ఎదురుదాడులపై ర్యాలీలో ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తున్నానని, దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురానని, జాతి ప్రయాణం ఆగదు, విజయయాత్ర కొనసాగుతుందని చెప్పారు.
‘జై జవాన్-జై కిసాన్’ నినాదంతో ముందుకు సాగుతున్నామని,వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పని చేస్తున్నామని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని, దేశ రక్షణలో అమరులైన సైనికుల స్మృత్యర్థం నిన్న యుద్ధ స్మారకం ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ గడ్డపై నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ దేశాన్ని ఎప్పటికీ మరణశయ్యపైకి తీసుకెళ్లను.. ఈ దేశం ఎప్పటికీ ముందడుగు వేయకుండా ఆగదు.. ఈ దేశం ఎప్పటికీ తల వంచదు. భారతీయులందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ ప్రధాన సేవకుడు మీకు తలవంచుతున్నాడు అని మోదీ ఉద్వేగభరితంగా మోడీ ప్రసంగించారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు.