రాజకీయాల్లో ఎన్నాళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి ఉన్నాం.. అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని గౌరవించే రాజకీయాలు ప్రజల్లో ఏనాడో పోయాయి. మీరు ఎన్నాళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటే మాకేంటి మాకేం చేశారు? అని ప్రజలు నిలదీసే రోజులు వచ్చాయి. గుడ్డిగా జెండా మోసే రోజులు కూడా పోయాయ్. నీవల్ల మాకేంటి లాభం అని ప్రశ్నించే ప్రజలు తెరమీదికి వస్తున్నారు. అందుకే మునుపెన్నడూ లేని విధంగా రాజకీయాల్లో సామాన్యుల పాత్ర పెరిగింది. వారు ఎప్పుడు ఏ సమస్యను తెరమీదికి తెచ్చినా తీర్చడం రాజకీయ నేతల వంతైంది. సరే! మారిన కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లిన వారికి రాజకీయాల్లో ఖచ్చితంగా చోటు ఉంటుంది.
ఇక, ప్రకాశం జిల్లా పరుచూరు రాజకీయం తాజాగా ఒక్కసారిగా భగ్గుమంది. అన్నగారు ఎన్టీఆర్ పెద్ద అల్లుడుగా, రచయి తగా కొండొకచో.. నటుడిగా గుర్తింపు పొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల రాజకీయం ఒక్కసారిగా రోడ్డెక్కిం ది. ప్రజలు తీవ్రస్థాయిలో వీరిపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తమపై కామెంట్లు వస్తున్నాయని పురందేశ్వరి ఏకంగా మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. కానీ, ఈ విషయంలో వాస్తవాలు గమనిస్తే.. సోషల్ మీడియాకు ఎవరూ అధిపతి ఉండరు. ప్రజలే అధిపతులు. కాబట్టి ఇప్పుడు పురందేశ్వరి కానీ, వెంకటేశ్వరరావు కానీ ఒకరిపై బెడ్డలు వేసే బదులు ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదనేది విజ్ఞుల సూచన.
సొంత లాభం కోసమే రాజకీయాలు చేశారనేది దగ్గుబాటి కుటుంబంపై ఉన్న ప్రధాన విమర్శ. ఈ స్వలాభం కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు పార్టీలు మారారనేది సోషల్ మీడియాలో ప్రజల ఆవేదన. సరే మారితేమారారు. కానీ, ప్రజల సమస్యలపై ఈ దంపతులు దృష్టి పెట్టింది లేదనేది ఆగ్రహం. ఎన్టీఆర్ బ్రిడ్జి నిర్మాణం కోసం చినగంజాం ప్రజలు ఎన్నాళ్లు ఇక్కడ ఎదురు చూశారు. వరుస విజయాలు తెచ్చుకుని కూడా ప్రజలకు సేవ చేయకపోతే.. ఎలా అనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం మళ్లీ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు వైసీపీ తరఫున పోటీకి సిద్ధపడడం, రాజకీయమే లక్ష్యంగా తప్ప.. ప్రజాసేవే పరమార్థంగా మారిన పరిపరిస్థితి లేకపోవడం వల్లే.. నేడు ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. దగ్గుబాటి రాజకీయం ఒకరకంగా వారికి మాత్రమే కాదు..నేటిరాజకీయాల్లో చాలా మందికి అన్వయం అవుతుంది.