గల్లా జయదేవ్ గొప్ప వ్యక్త కాకపోయినా తనకున్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో ఏపి సమస్యలపై దాదాపు గంటపాటు లోక్ సభలో చక్కగా మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా తెలుగుదేశంపార్టీ తరపున చర్చ మొదలుపెట్టిన గుంటూరు ఎంపి గల్లా ధాటిగానే వాదన వినిపించారు. సభలో ఎంపిల సంఖ్యాబలం ఆధారంగా స్పీకర్ కేటాయించిన సమయం 13 నిముషాలే అయినప్పటికీ గల్లా దాదాపు గంటపాటు ప్రసంగించారు. తన ప్రసంగం మొత్తంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని లక్ష్యం చేసుకోవటం కన్నా కేంద్రప్రభుత్వాన్నే తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్రమోడినే అయినప్పటికీ మోడిని నేరుగా తప్పు పట్టటంలో, ఇరకాటంలో పడేయటంలో ఉండే కిక్కును గల్లా కోల్పోయారు.
మోడి హామీలను గుర్తుచేసిన గల్లా
యూపిఏ చేసిన రాష్ట్ర విభజనతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గల్లా 2014 ఎన్నికల సమయంలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడి విభజిత ఏపికి చేసిన ప్రామిస్ లను, ప్రధానమంత్రి అయిన తర్వాత తుంగలో తొక్కిన హామీలను ఉదహరించారు. అందులో సహజంగానే ప్రత్యేకహోదా హామీని కూడా ప్రస్తావించారు. అడ్డుగోలు విభజన వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో వివరించారు. నాటి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఏపికి చేసిన అన్యాయాన్ని వివరించారు. అయితే రాష్ట్ర విభజనకు మద్దతుగా చంద్రబాబునాయుడు ఇచ్చిన రెండు లేఖలను మాత్రం ప్రస్తావించలేదు.
టిడిపిపై కేంద్రం యుద్దం ప్రకటించిందా ?
పోనీ అడ్డుగోలు విభజన తర్వాతైనా ఏపికి న్యాయం చేశారా అంటూ కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ లో ఉన్న కేంద్రప్రభుత్వ సంస్దలు, ప్రభుత్వ రంగ సంస్దలతో పాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్ధలను తెలంగాణాకే వదిలేయటంలోని ఔచిత్యాన్ని ఎంపి నిలదీశారు. రెవిన్యూలోటును సరిగా భర్తీ చేయకపోవటం, ఏపిలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు సక్రమంగా అందిచకపోవటం, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇవ్వని విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రణాళికా సంఘం పేరుతో ఏపికి కేంద్రం ప్రత్యేకహోదాను ఎలా ఎగొట్టిందో వివరించారు. ఒక విధంగా టిడిపిపై కేంద్రం యుద్ధం ప్రకటించిందంటూ ఆరోపించారు.
మోడి, జైట్లీని తప్పుపట్టిన గల్లా
నరేంద్రమోడి వైఖరితో తమను కేంద్రప్రభుత్వం మోసం చేసిందని ఏపి జనాలు భావిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి పేర్లతో జనాలను కేంద్ర ఆర్ధికశాఖ అరుణ్ జైట్లీ ఏ విధంగా మోసం చేసింది సూటిగా వివరించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయనిరాకరణపై మండిపడ్డారు. అన్నీ విధాల దెబ్బతిన్న, వెనుకబడిన ఏపి అభివృద్ధికి ప్రత్యేకహోదా ఏ విధంగా ఉపయోగమో వివరించారు. ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేయగానే తమపై కేంద్రం కక్షగట్టిందంటూ ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నదో లెక్కలు చెప్పారు. మొత్తం మీద 50 నిముషాల తన స్పీచ్ లో గల్లా స్పీకర్ ను ఉద్దేశించే కాకుండా ప్రధానమంత్రి, ఆర్ధికశాఖ మంత్రులను ఉద్దేశించి కూడా సూటిగా మాట్లాడటం పలువురిని ఆకట్టుకుందనే చెప్పాలి.