వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే పలువురు నేతలు తమ సీటును త్యాగం చేయటానికి సిద్దపడుతున్నట్లుంది. నారా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలుగా తమ సీటును త్యాగం చేయటానికి సిద్దంగా ఉన్నట్లు పలువురు నేతలు ప్రకటించటంపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా త్యాగధనుల జాబితాలో చేరిపోయారు.
లోకేష్ కోసం 175 నియోజకవర్గాలూ రెడీనట
ఇంతకీ విషయం ఏమిటంటే, మంత్రి లోకేష్ అడగాలే కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తన నియోజకవర్గం చిలకలూరిపేట సీటును ఇచ్చేస్తానంటూ ప్రత్తిపాటి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎక్కడి నుండి పోటీ చేయాలని అనుకున్నా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్ధులంతా సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశారులేండి. అయితే, ప్రత్తిపాటి మరచిపోయిన విషయం ఒకటుంది. 175 నియోజకవర్గాల్లో సుమారు 25 నియోజకవర్గాలు రిజర్వుడు నియోజకవర్గాలు. అందులో లోకేష్ ఎటూ పోటీ చేసే అవకాశం లేదు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనే లోకేష్ కు అవకాశం.
సీటు త్యాగం వరకూ ఓకేనే..మరి గెలుపో ?
సీటును త్యాగం చేయటం వరకూ ఓకేనే. కాకపోతే ఎన్నికల్లో గెలవటం గురించే ఆలోచించుకోవాలి. ఆ విషయంలో స్పష్టత లేకపోవటం వల్లే తాను ఎక్కడి నుండి పోటీ చేసేది లోకేష్ ఇంత వరకూ ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారే కానీ ఆ నియోజకవర్గమే ఏదని అడిగితే మాత్రం చినబాబు సమాధానం చెప్పటం లేదు. చంద్రబాబునాయుడు తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2 స్ధాయిని ఆస్వాధిస్తున్న లోకేష్ కు గెలుపు గ్యారెంటి ఇచ్చే నియోజకవర్గం ఒక్కటి కూడా దొరకలేదా అనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.
గెలుపుపై నమ్మకం లేదా ?
ముందస్తు ఎన్నికలపైన కూడా ప్రత్తిపాటి తనదైన శైలిలో స్పందించారు లేండి. ఐదేళ్ళు పాలించమని తమకు ప్రజలు తీర్పిచ్చారట. కాబట్టి తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటూ ప్రత్తిపాటి లా పాయింట్ లేవదీశారు. ప్రత్తిపాటి పాయింట్ వరకూ బాగానే ఉంది కానీ మరి, 2003లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా జనాలు ఐదేళ్ళు పాలించమనే కదా తీర్పిచ్చింది ? మరి అప్పుడెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ?
అచ్చిరాని ముందస్తు
అంటే అప్పట్లో తనపై మావోయిస్టులు దాడి జరపటం, తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవటంతో జనాల్లో సానుభూతి ఉందని చంద్రబాబు నమ్మారు. దాంతో సానుభూతితో మళ్ళీ గెలవచ్చనే నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. తీరా చూస్తే జనాలు మాడు పగలగొట్టారు. అదే అనుభవం ఇపుడు కూడా రిపీట్ అవుతుందనే అనుమానంతోనే ముందస్తుకు ఇష్టపడటం లేదని పార్టీలోనే ప్రచారం జరుగుతున్న విషయం బహుశా ప్రత్తిపాటి దృష్టికి రాలేదేమో ?