తెలంగాణ ఉద్యమం - తెలంగాణ అవతరణం



నేడు తెలంగాణా నాలుగవ అవతరణ దినోత్సవం. అంటే తెలంగాణా వాసుల కలలు నిజమైన రోజన్న మాట. అసలు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తీరు పరిస్థితులపై ఒక అవగాహన కలిగించటమే ముఖ్యోద్దేశం. సాధారణ  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇందులో భాగస్వామ్యం అసలు లేనే లేదు.

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఉన్నత రాజకీయ, కుల, ప్రాంత వర్గాలతో ప్రవర్తనతో విసిగి వేశారిన తెలంగాణా వాసుల, సంపూర్ణ సంఘటిత ఆక్రోశం బలమైన కోరిక సంకల్ప మే తెలంగాణా రాష్ట్రం కావాలనే ఆశలకు ఆకాంక్షకు ఊపిరులూదాయి. 



భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రకారం ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరు చేస్తూ తెలంగాణాను ప్రత్యేక రాష్టంగా ఏర్పరచా లని మొదలైన ఉద్యమం దాదాపు (1969 నుండి 2014 వరకు) 50 సంవత్సరాల పాటు కొనసాగి నేటి రోజున 2014 లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబరులో, రాష్ట్రాల పునర్విభజన కమిషను (శృఛ్) ను నియమించడం జరిగింది. ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమిషన్ హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ మరియు కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రం లోనూ కలిపివేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదికలో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో విలీనంచేయడం వలన కలిగే లాభ నష్టాలను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్ర ప్రాంతంలో అధికంగా వున్నప్పటికి, తెలంగాణా ప్రాంతంలో కొంత అయిష్టత వ్యకతమవగా అదీ స్పష్టం గా లేకపోవటంతో తెలంగాణాను హైద్రాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైదరాబాద్ రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యతవస్తే విలీనం జరపాలని సూచించారు.





అయినప్పటికీ, జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్రప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం ప్రత్యేక అంశంగా తీర్మానించి ఆ తర్వాత 1956, నవంబరు 1న ఆంధ్ర మరియు తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. 1948లో పోలీస్‌ యాక్షన్‌ తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారుల పాలనలో ఉండటంవల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి క్రింద శిక్షణ పొంది అనుభవమున్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించు కున్నారు. 




అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్ర వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి.

పెద్దమనుషుల ఒప్పందం గాలి కొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ లోని థర్మల్‌ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచ వేదికగా నిల్చింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు.




తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహారదీక్షకు దిగాడు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణానికి పాకింది. జనవరి 9న పట్టణంలో  బి.ఎ. స్టూడెంట్‌, నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకుడైన రవీంధ్రనాథ్‌ గాంధీచౌక్‌ దగ్గర నిర వధిక దీక్ష ప్రారంభించాడు. అతనితో పాటు ఖమ్మం మున్సిపాల్టీ ఉపాధ్యక్షుడు, కవి అయిన శ్రీ కవి రాజమూర్తి కూడా నిరాహారదీక్షలో పాల్గొన్నారు.




తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం వంద కోట్లు ఖర్చు చేయాలని, పోచంపాడు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధి లో తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులను నింపాలని తీర్మానాలు చేశారు. ఆ మరునాడు అంటే జనవరి 10న ఉద్యమం నిజామాబాద్‌ కు పాకింది. ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేరారు.




జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో "తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి" ఏర్పడింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్థుల కార్యాచరణ సమితి మెడికల్‌ విద్యార్థి మల్లిఖార్జున్‌ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని మల్లిఖార్జున్‌ పిలుపు నిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరు ఒక సమావేశం ఏర్పాటు చేసి "తెలంగాణ పరిరక్షణ కమిటీ" ని స్థాపించారు. విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటించారు. జనవరి 20న శంషాబాద్‌లో పాఠశాల విద్యార్థులపై తొలిసారిగా కాల్పులు జరిపారు.




ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగుల నిధుల లెక్కలు తేల్చాలని జస్టిస్‌ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. 1969 జనవరి 22న తెలంగాణ ప్రాంత ప్రజా ప్రయోజనాల పరిరక్షణ  అమలు చేయడానికి, ప్రభుత్వం జి.వో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్‌ ముల్కీ ఉద్యోగును వాపస్‌ పంపిస్తా మని, జి.వోను నిర్లక్ష్యం చేసే అధికారుపై చర్యు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.


జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17ఏళ్ల శంకర్‌ మరుసటి రోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్‌.




కాల్పులకు నిరసనగా 'కొండా లక్ష్మణ్ బాపూజీ' తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 'ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితి' ని ఏర్పాటు చేశారు. జూన్‌ 4న తెంగాణ లో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్‌ నగరానికి వచ్చి విద్యార్థి నాయకులు, 'తెలంగాణ ప్రజా సమితి' నాయకులతో చర్చలు జరిపింది. దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధభూమిని తలపించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. మొత్తం 95సార్లు కాల్పులు జరి గాయి. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో కర్ఫ్యూ విధించారు.




ఉద్యమంలో 369మంది చనిపోగా, ప్రభుత్వ లెక్కలు మాత్రం 57మంది చనిపోయినట్టుగా చెప్పాయి. ఈ విషయములో ఆంధ్రుల ఆధిపత్య ప్రభుత్వం పూర్తిగా బ్రిటీష్ లేదా నిజాం పాలనను తలపింపజేసింది. కొంత ఉద్రిక్తల మద్య "తెలంగాణ ప్రజా సమితి" నేత తో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబరులో మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్థి నాయకుడు మల్లికార్జున్‌ ఒక సమ్యుక్త ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్థును ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు.




ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గత 50సంవత్సరాలనుండి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ 2001లో "తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ" ఏర్పడిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో "కల్వకుంట్ల చంద్రశేఖర రావు" నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే, స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తోలి అమరుడు కాసోజు శ్రీకాంత చారి.




కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసి అమరుడు అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన "తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి" ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పు కోదగినవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది.  ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటి సమైక్యాంధ్ర ఉద్యమము ఏర్పాటుకు పరిస్థితులు దారితీసాయి.




సకల జనుల సమ్మెకు ఒక రోజుముందు, 2011సెప్టెంబరు 12న టి ఆర్ ఎస్ ప్రజా సదస్సు కరీంనగర్ లో నిర్వహించింది. దీనిలో టిజెఎసి నాయకులు, బిజెపి మరియు న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 13 సెప్టెంబరు నుండి ప్రారంభమై 42రోజుల పాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు, పాల్గొన్నారు. దీనిలో భాగంగా రైళ్ల నిలిపివేత చేపట్టబడింది. విద్యుత్ ఉద్పాదన తగ్గింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిగినవి. 16 అక్టోబరున రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా తదుపరి ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. 




ఈ సమ్మె కేంద్రం ఆలోచనను మార్చగలిగిందని ఉద్యమం వేరేవిధంగా కొనసాగుతుందని కోదండరామ్ ప్రకటించాడు. ఉదృతమైన సమ్మెను నిలువరించటం ఇక సాధ్యం కాదని భావించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2013 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ప్రకటించడం ఆపై ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలకు స్పందించకుండా ధృడంగా నిలబడ్డ ప్రజల ధృఢ చిత్తం ముందు ఆంధ్రావలసవాదుల వాదనలు వీగిపోయి  తెలంగాణా ప్రజావాహిని కలనిజం చేస్తు పార్లమెంట్ 02.06.2014 తెలంగాణా అవతరణ దినంగా ప్రకటించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: