రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల నాయకుల మధ్య అప్పుడే సీట్ల దోబూచులాట స్టార్ట్ అయ్యింది. ఏదో ఒక పార్టీలో చేరి సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసేవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ నాయకుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఈ టెన్షన్ తెలంగాణలో పెద్దగా లేకున్నా ఏపీ బీజేపీ నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందా ? పొత్తు లేకపోతే తాము గెలుస్తామా ? పొత్తు ఉంటే తమకు అనుకూలమైన సీటు వస్తుందా ? రాదా ? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఏపీ బీజేపీ లీడర్లను తెగ వేధించేస్తున్నాయి.
ఈ క్రమంంలోనే ఏపీకి గత ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో హామీలు ఇచ్చింది. ప్రత్యేకహోదా, రైల్వే జోన్ను కమలనాథులు పట్టించుకోకపోవడంపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం నివురు గప్పిన నిప్పులా పెరుగుతోంది. అసలు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి కూడా ఓట్లు వేస్తారా ? వేయరా ? అన్న డౌట్ టీడీపీ వాళ్లనే తెగ టెన్షన్ పెట్టేస్తోంది. ఒకవేళ టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ నాయకులకు డిపాజిట్లు కూడా రావన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తే తనకు డిపాజిట్లు కూడా రావని డిసైడ్ అయిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నట్టు గుంటూరు జిల్లాలో జోరుగా వినిపిస్తోన్న టాక్. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఓ రేంజ్లో వెలిగిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమంత బాగోలేకపోవడంతో ఆయన బీజేపీ నుంచి జంప్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేద్దామన్న ప్లాన్లో ఉన్న కన్నా పొత్తు లేకపోతే మాత్రం వైసీపీలోకి జంప్ చేసేద్దామని డిసైడ్ అయ్యారట. ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉండడం, బీజేపీకి ఇక్కడ ఫ్యూచర్ లేదన్న నిర్ణయానికి వచ్చిన కన్నా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీలోకి ఇప్పటికే కన్నాకు ఆఫర్లు ఉన్నాయి. ఆయన పార్టీలోకి వస్తే పెదకూరపాడు లేదా గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు ఇస్తామని వాళ్లు ఆఫర్లు ఇస్తున్నా కన్నా మాత్రం తనతో పాటు తన కుమారిడికి రెండు సీట్లు కావాలని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కన్నా బీజేపీకి ఫ్యూచర్ లేదని డిసైడ్ అయ్యారన్నదే గుంటూరు జిల్లాలో బలంగా వినిపిస్తోన్న టాక్.