తాజ్ మహల్ కాదు.. అది తేజో మహల్..! శివాలయాన్ని కూల్చేసి కట్టారు..!!

Vasishta

హిందూ ముస్లింల మధ్య అయోధ్య ఎంతటి వివాదాస్పదమో ప్రపంచం మొత్తానికీ తెలుసు. అది రామజన్మ స్థలమని హిందువలంటుంటే.. అక్కడి మసీదుపై ముస్లింలు పోరాడుతున్నారు. ఇప్పుడు తాజ్ మహల్ కూడా ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికవుతోంది. తాజ్ మహల్ ఓ శివాలయమనే వాదన తెరపైకి వచ్చింది. ఇదిప్పుడు దేశంలో హాట్ టాపిక్.!


          రెండ్రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్.. తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది దేశద్రోహులు కట్టిందని చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కృతికి అదొక మాయని మచ్చ అని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. దీంతో తాజ్ మహల్ ను ఆరాధించేవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. విమర్శలు గుప్పించారు. బీజేపీ దీన్ని కావాలనే వివాదాస్పదం చేస్తోందనే ఆరోపణలు వినిపించాయి.


          సోమ్ ఆ మాట అని రెండ్రోజులు కాక ముందే బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ తాజ్ మహల్ పై మరో సెన్సేషన్ కామెంట్ చేశారు. అది తాజ్ మహల్ కాదని, తేజో మహల్ అని చెప్పారు. తాజ్ మహల్ కట్టకముందు అక్కడ శివాలయం ఉండేదన్నారు. దాన్ని కూల్చేసి పాలరాతి కట్టడం నిర్మించాలని వివరించారు. తాజ్ మహల్ పై అనేక హిందూ దేవుళ్లు, దేవతల గుర్తులున్నాయని చెప్పుకొచ్చారు.


          తాజ్ మహల్ సమాధి అయితే.. అక్కడ అన్ని గదులెందుకు నిర్మించారని వినయ్ కటియార్ ప్రశ్నించారు. సీఎం యోగి తాజ్ మహల్ ను సందర్శించి.. ఆది ఆలయమో, సమాధో చెప్పాలన్నారు. తాజ్ మహల్ ను కూల్చేయాల్సిన అవసరం లేదని, తప్పకుండా పేరు మాత్రం మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ కట్టడాలని కూల్చేసింది మొఘల్సేనని ఆయన విమర్శించారు.


          తాజ్ మహల్ పై వరుస కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ నేతలు ఇలా వరుస కామెంట్లు చేస్తూ.. దాన్నొక ఆలయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండడంతో ఇది మరొక అయోధ్య అవుతుందేమోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: