
వైసీపీకి మరో 8 మంది ఎమ్మెల్సీలు గుడ్ బై ... !
ఏపీ లో ప్రతిపక్ష వైసీపీకి వరుస పెట్టి ఎదురు షాకులు తగలనున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇప్పటికే రాజీనామా చేసిన వైకాపా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ రాజీనామాలను ఆమోదించాలంటూ బుధవారం ఆందోళనకు దిగడం చూస్తుంటే ఆ పార్టీ లో ఉండేందుకు మరి కొందరు సైతం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇక పైన చెప్పుకున్న ఎమ్మెల్సీలు అంతా మండలి ఛైర్మన్ మోషేనురాజును ఆయన కార్యాలయంలో కలిసి తమ రాజీనామా సంగతి తేల్చాలని పట్టుబట్టారు. తమ రాజీనామాలు ఆమెదించాలని వీరు మండలి లోనూ పట్టుబట్టారు.
వీరంతా రాజీనామాలు చేసి సుమారు ఆరేడు నెలలు అవుతోంది. వీరితో పాటే రాజీనామా చేసిన పోతుల సునీత.. ఆ తర్వాత మండలికి కూడా రావడం లేదు. ఇక బుధవారం మర్రి రాజశేఖర్ తన రాజీనామా పత్రాన్ని మండలి ఛైర్మన్కు ఇస్తున్న టైంలో కొందరు వైసీపీ ఎమ్మెల్సీ లు కూడా అక్కడే లాబీల్లో అటూ ఇటూ తిరిగారు. వీరిలో వీరు తర్వాత పడే వికెట్లు ఎవరివి అంటూ చర్చించుకున్నారు. గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదని .. అందుకే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న మరి కొందరు కూడా కొంత కాలం వేచి చూద్దామా ? వద్దా ? అన్న చర్చల్లో ఉన్నారని తెలుస్తోంది.
మర్రి రాజశేఖర్ టీడీపీ లో చేరేందుకు లైన్ క్లీయర్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా ఆమోదం పొందిన వెంటనే మరి కొందరు సైతం పార్టీకి .. పదవులకు రాజీనామా లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాము రాజీనామాల కు రెడీగా ఉన్నామని ఇప్పటికే కూటమికి సంకేతాలు పంపారని తెలిసింది. ఇలాంటి ఎమ్మెల్సీలు సుమారు 8 మంది వరకూ ఉన్నారనే చర్చ మండలి వర్గాల్లో నడుస్తోంది.