తెలుగుజాతికి అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్.. !
- ఎన్టీఆర్తోనే బడుగు, బలహీన వర్గాలకు గుర్తింపు
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
ఎన్నో సంచలనాల మధ్య కేవలం 9 నెలలకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పై.. ప్రజల్లో భారీ అంచనాలు ఉండేవి. ఈ అంచనాలు నిజం చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎంతోమంది పేద ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ.. ఎన్నో సంక్షేమ పథకాలు వారికోసం అమల్లోకి తీసుకువచ్చారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా చేశారు. మరియు ముఖ్యంగా ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనానికి కారణమయ్యాయి. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం రిజర్వేషన్లు తీసుకువస్తే.. ఎన్టీఆర్ అప్పటివరకు వెనకబడిపోయిన ఎన్నో బడుగు బలహీనవర్గాలకు బీసీల పేరిట రిజర్వేషన్లు తీసుకువచ్చారు.
ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది బడుగు .. బలహీన వర్గాలకు చెందిన వారు విద్యావంతులు కావడంతో పాటు.. ఉన్నత ఉద్యోగాలలోకి వచ్చారు. అలాగే స్థానిక సంస్థ ఎన్నికలలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల.. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు.. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై తమ అభివృద్ధికి 1980వ దశకంలోనే బలమైన పునాది వేసుకున్నారు. అలాగే అప్పటి వరకు చట్ట సభల్లో బీసీల ప్రాథినిత్యం.. బీసీ ప్రజా ప్రతినిధుల పాత్ర చాలా నామామాత్రంగా ఉండేది. ప్రతి పది మందిలో ఒక్క బీసీ ప్రజా ప్రతినిధికి అవకాశం రావడమే గొప్ప అన్నట్టుగా ఉండేది.
కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎందరో బీసీ లకు ఎంపీ.. ఎమ్మెల్యే టిక్కెట్ల తో పాటు జడ్పీ చైర్మన్లు... ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇచ్చి వారి రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డారు. అలాగే పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చు అన్న నిర్ణయం కూడా.. ఎన్టీఆర్ తీసుకున్నదే. అలాగే స్త్రీలకు ఆస్తుల లో వాటా ఉండాలని.. చట్టం తెచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావుది కావటం విశేషం.