విధ్వంసాలకు చిరునామాగా ఏపీ.. వైసీపీ కార్యకర్త హత్యపై జగన్ సంచలన వ్యాఖ్యలు!

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పాలన అద్భుతంగా జరుగుతున్నా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వినుకొండలో వైసీపీ కార్యకర్త షేక్ అబ్దుల్ రషీద్ అనే యువకుడిని నరికి చంపడంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని జగన్ ట్వీట్ చేశారు.
 
ఏపీలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని జగన్ చెప్పుకొచ్చారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన కామెంట్లు చేశారు. వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని జగన్ పేర్కొన్నారు.
 
వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని జగన్ కామెంట్లు చేశారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని జగన్ పేర్కొన్నారు.
 
హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని అధికారం శాశ్వతం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాలని జగన్ కోరారు. మోదీ, అమిత్ షా రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని జగన్ వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. రషీద్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని జగన్ పేర్కొన్నారు. జగన్ వెల్లడించిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: