బాబుకు బిగ్ సవాళ్లు: పోలవరం పోటు..మరో కాళేశ్వరం అవుతుందా.?
- చంద్రబాబు అయినా పూర్తి చేస్తారా.?
- ఈ తరం ప్రజలు పోలవరాన్ని చూసే భాగ్యముందా.?
పోలవరం ప్రాజెక్ట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరు గాంచింది. దీని పేరులోనే వరం ఉంది తప్ప ఏపీ ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం లోకి రాలేదు. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటివరకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు సాగు తాగు నీరు మరియు విద్యుత్ ఉత్పత్తి అవసరాలతో పాటు ఎన్నో పారిశ్రామిక అవసరాలు తీర్చేలా డిజైన్ చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే ఈ పోలవరం పనులు ఒక్క అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కు అనే విధంగా నడుస్తూ ఉంది.ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నకు ఇప్పటికి సమాధానం దొరకడం లేదు.ఇప్పటికే ఎంతో మంది ముఖ్యమంత్రులు గడువులు ఇచ్చుకుంటూ పనులు చేయిస్తామని కొన్ని పనులు చేయించారు తప్ప ఎవరూ కూడా పూర్తి చేయలేకపోయారు. అలాంటి ఈ ప్రాజెక్టును చంద్రబాబు అయినా పూర్తి చేస్తారా.. మాటలకే పరిమితం చేస్తారా అనే వివరాలు చూద్దాం..
బడ్జెట్ వ్యయం :
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత భూసేకరణ చట్టాన్ని సవరించడంతో ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. 2013- 14 అంచనా ప్రకారం 20,398 కోట్లుగా ప్రకటించారు. 2017- 18 కి వచ్చేసరికి 55,548 కోట్లకు చేరింది. అలాంటి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పునరావాసం పునర్నిర్మాణ పనులకు దాదాపు 34 వేల కోట్లు అవుతాయని అంచనా వేశారు. అయితే జగన్ ప్రభుత్వం 2024 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి దాన్ని పూర్తి చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు కేంద్రంలో కీలకమైన వ్యక్తిగా మారారు. దీంతో ఆయన రాష్ట్రంలో పాలన ఒకెత్తయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మరో ఎత్తుగా భావించారు. తాజా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించారు. సోమవారం పోలవరం పేరుతో ప్రతి సోమవారం ప్రాజెక్టుపై రివ్యూ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఒకసారి పోలవరం దగ్గరికి ప్రత్యక్షంగా ఆయన వెళ్లి చూస్తానని కూడా హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సహకారం పూర్తిగా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు తెలుస్తోంది.