జనసేనలో పవన్కే లేని రేర్ రికార్డ్ ఆ ఇద్దరికే సొంతం.. !
జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు రెండు నెలల ముందు ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని అందరూ భావించినా పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చేందుకు తన వంతుగా కృషి చేశారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలది మూడు దారులు అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూడు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీచేసి వైసీపీని గద్దె దింపాయి.
ఇదిలా ఉంటే జనసేనలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేని ఒక రికార్డ్ ఇద్దరికి మాత్రమే దక్కింది. జనసేన పార్టీ నుంచి తొలి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికలలో రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ రావు సొంతం చేసుకున్నారు. జనసేన పార్టీ నుంచి తొలి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్లిన రికార్డు వరప్రసాద్ రావుకే దక్కుతుంది. అయితే ఆయన పార్టీ ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేకపోయారు. వైసీపీ చెంత చేరిన రాపాక ఈ ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
ఇక పార్టీ నుంచి తొలి ఎమ్మెల్సీగా.. ఏలూరు కి చెందిన పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ సొంతం చేసుకున్నారు, తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత సీ. రామచంద్రయ్య మరోసారి తన స్థానం నిలుపుకున్నారు. ఇక రెండో సీటును చంద్రబాబు జనసేనకు కేటాయించగా.. పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్కు ఆ అవకాశం దక్కింది. అలా జనసేన పార్టీ ప్రస్థానంలో తొలి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు రికార్డుల్లోకి ఎక్కితే.. తొలి ఎమ్మెల్సీగా పిడుగు హరిప్రసాద్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.