చంద్రబాబుకు వాలంటరీ బాధ...!
ఇప్పుడు చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అనే చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాలను తీసేస్తున్నట్టు తెలుస్తోంది. వీటి వల్ల.. ఆర్థిక భారమే తప్ప.. మరొకటి లేదని.. ప్రభుత్వం భావిస్తోంది. నెల తిరి గే సరికి కరెంటు బిల్లు.. అద్దెలు, ఇతర ఖర్చుల రూపంలో సచివాలయాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి వస్తోందని లెక్కలు వేసుకుంది. పైగా.. వీటివల్ల ప్రజలకు ప్రత్యేకంగా ఒనగూరుతున్న ప్రయోజనాలు కూడా.. కనిపించడం లేదని చంద్రబా బుకు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
దీంతో సచివాలయాలను దాదాపు మార్పు చేసేదిశగా ఆలోచన చేస్తున్నారు. అదేవిదంగా ప్రస్తుతం పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్న సెక్రటరీలు.. ఇతర సిబ్బందిని వేరే విభాగానికి ఎటాచ్ చేయాలని ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు వలంటీర్ల పరిస్థితి ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వీరిని తీసేయాలంటే.. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని వారు గుర్తు చేస్తున్నారు. కొనసాగిద్దామంటే.. వీరు కేవలం పింఛన్ల పంపిణీకి మాత్రమే పరిమితమవుతున్నారు తప్ప.. ఇతర పనులకు కాదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు సర్కారు అంతర్మథనంలో పడిపోయింది. మరోవైపు.. జూన్ నెల మొత్తం కూడా.. వలంటీర్లకు ఎలాంటి పనీ అప్పగించలేదు. 2.3 లక్షల మంది వలంటీర్లు ఉంటే.. వారిలో 90 వేల మంది రాజీనామాలు చేశారు. వారిని తీసేయగా.. మరో 1.4 లక్షల మంది వలంటీర్లు విధుల్లోనే ఉన్నారు. గత రెండు మాసాలు కూడా.. వైసీపీ సర్కారు వారికి సొమ్ములు చెల్లించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎలాంటి పనులూ అప్పగించలేదు. ఇక, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత. కూడా వారికి ఎలాంటి పనీ ఇవ్వలేదు. కానీ, జూన్ మాసానికి జీతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో జూలైలో వారికి సంబంధించి నిర్ణయం తీసుకునే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.