త్వరలో బిఆర్ఎస్.. ఆ పార్టీలో విలీనం కాబోతుందా?
గత పది ఏళ్లుగా పోరాడుతున్న కాంగ్రెస్ కేవలం టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా గెలిచింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చలేదు. గ్యాస్ సిలిండర్లు రూ.500 కే ఇస్తామని చెప్పారు కానీ వాటిని డైరెక్ట్ గా కాకుండా బ్యాంకు అకౌంట్ లో వేస్తామని తిరకాసు పెట్టారు. సరిగా కరెంటూ ఇవ్వడం లేదు, కళ్యాణ్ లక్ష్మీ కింద తులం బంగారం కూడా ఇవ్వట్లేదు.
కొత్త పెన్షన్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. అయినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ను ఇప్పటికీ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. చూస్తుంటే కేసీఆర్ స్థాపించిన ఈ పార్టీ పని అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే "అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంద"ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి శనివారం మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కథ ముగిసింది అని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు లేదంటూ ధ్వజమెత్తారు. ఆరు నూరైనా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలలో కోట్లలో అవినీతి జరిగినట్లు అలిగేషన్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పరిపాలన అందించడానికి బదులుగా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లలోనే టైమ్ గడిపారని విమర్శించారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కూడా అన్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడానికి కారణం ఇదే నొక్కి చెప్పారు.