ప్రభుత్వంలో నెంబర్ - 2 ఎవరు... వాళ్లిద్దరిలా డమ్మీ అవ్వడుగా..!
- గతంలో చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి డమ్మీలే
- తేడా వస్తే జనసేనతో కష్టమే బాబు
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఎవరు అని చర్చించుకుంటే వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్కు చంద్రబాబు అత్యంత గౌరవం ఇచ్చారు. వాస్తవానికి 2014 లోనూ ఇద్దరికి చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. నిమ్మకాయల చిన్నరాజప్ప, కేఈ కృష్ణమూర్తిలను చంద్రబాబు ఉప ముఖ్యమంత్రులు చేశారు. అయితే.. అప్పటికి, ఇప్పటికి ఈక్వేషన్లలో తేడా ఉంది. అప్పట్లో రాయలసీమ ప్రాంతంలో గౌడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కేఈ కృష్ణమూర్తికి అవకాశం ఇచ్చారు.
ఇక, తూర్పుగోదావరి జిల్లాల్లో కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో చిన్నరాజప్పకు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. ఇద్దరికీ పెద్దగా అధికారాలు మాత్రం కట్టబెట్టింది లేదు. పైకి వారిద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ.. అధికారాలు మాత్రం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ల చుట్టూనే తిరిగాయి. అధికారులు కూడా వారిద్దరు చెబితేనే చేశారనే వాదన వినిపించింది. డీఎస్పీల బదిలీలు జరిగినప్పుడు.. అప్పటి ఉపముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఉన్న చిన్న రాజప్ప అసలు బదిలీలు జరిగిన విషయమే తనకు తెలియదంటూ ప్రకటించారు. దీంతో అసలు ఏం జరుగుతోందోనన్న చర్చ మొదలైంది.
దీంతో చంద్రబాబు ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరికి అవకాశం ఇచ్చినా.. ఏవో కారణాలతో అధికారం మాత్రం వారికి ఇవ్వలేదని పార్టీలోనే చర్చ సాగింది. అయితే.. ఇప్పుడు నాటి పరిస్థితులకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చంద్రబాబే స్వయం గా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇదేసమయంలో ఆయనకు కీలకమైన గ్రామీణ పాలన మొత్తం అప్పగించారు. దీనిని బట్టి పవన్కు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి కట్టడంలోనూ.. బీజేపీని ఒప్పించడం లోనూ.. తాజా గెలుపులోనూ కూడా.. పవన్ సెంట్రిక్గానే రాజకీయాలు సాగాయి.
ప్రచారం కూడా.. పవన్ బాగానే చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆది నుంచి కూడా పవన్కు ప్రాదాన్యం ఇస్తున్నారు. ఇటీవల జరిగిన కూటమి సమావేశాల్లోనూ పవన్కు చంద్రబాబు మంచి ప్రాధాన్యం కల్పించారు. ఆయనకు ఎలాంటి సీటు వేస్తే.. తనకు కూడా అలాంటి సీటునే వేయాలని చెప్పడం.. ప్రమాణ స్వీకారంలోనూ తను చేసిన వెంటనే పవన్ ప్రమాణం చేసేలా వ్యవహరించడం.. వంటివి చూస్తే.. ప్రభుత్వంలోనూ నెంబర్-2గా పవన్కు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోం ది. దీంతో జనసేన నాయకులను సంతృప్తి పరచడంతోపాటు, కూటమి పార్టీల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంకేతాలను చంద్రబాబు పంపుతున్నారని అంటున్నారు పరిశీలకులు.