కన్నీటాంధ్రప్రదేశ్: ఉత్తాంధ్రే, అమరబాధే, పల్నాడే, నిల్లూరు, చెత్తూరు, గోదారాళ్లే..!
ఉత్తాంధ్రే :
కళలకు కాణాచిగా పేరొందిన విజయనగరం, జీడిపప్పు దిగుబడిలో ఒకప్పుడు దేశంలోనే ముందున్న శ్రీకాకుళం.. విద్యలకు కేంద్రంగా భాసిల్లిన విశాఖ ఒకప్పుడు.. కానీ ఇవి నిన్నటి సంగతులు.. నేటిపరిస్థితి గమనిస్తే.. వలస పోతున్న జనాలు.. కడ్నీ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు.. తాగు నీరు.. సాగు నీరులేక ఇక్కట్లు పడుతున్న రైతన్నలు.. ఇక, ఐటీ పరిశ్రమలు పోయి.. ఉపాధి లేక.. ఉద్యోగాలు కొరవడి అల్లాడుతున్న యువత మరోవైపు.. మొత్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పుడు అలో లక్ష్మణా అంటూ.. అల్లాడుతున్నాయి. మొత్తంగా మూడు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా కూడా.. ప్రశాతంగా, మనశ్శాంతిగా లేవంటే.. అతిశయోక్తికాదు.. పచ్చి నిజం.
అమర ' బాధే ' :
విజయవాడ-గుంటూరులకు నడిబొడ్డున ఉన్న ప్రాంతం అమరావతి. ఒకప్పటికీ.. అమరపాలకుల రాజధాని. రాష్ట్ర విభజన తర్వాత.. అమరేశ్వరుడు కొలువైన ఈ దివ్య ప్రాంతాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసింది. రాష్ట్రానికి నవనగరాలతో కూడిన రాజధానిని అందించాలని నిర్ణయించింది. ఇక్కడి రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి.. నిర్మాణాలు చేపట్టింది. దేశంలోనే మేటి నగరంగా భాసిల్లుతుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు అమరావతి అంటే.. చెట్లు, తుప్పలు. మోడు వారిని మొక్కలు.. ఎండిపోయిన.. పొలాలు.. సగంలో నిర్మాణాలు ఆగిపోయిన కట్టడాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడా చూద్దామన్నా.. నాటి వైభవం లేక పోవడం గమనార్హం. సరైన సమయంలో నిర్మాణం జరిగి ఉంటే.. ఈ పాటికి బృహత్తరమైన నగరం ఏపీకి అందివచ్చేది.
పల్ ' నాడే ' :
నాయకురాలు నాగమ్మ, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి వారు.. నడయాడిన నేల నిజంగానే పౌరుషాలకు పురిటిగడ్డగా పేరొందిన ప్రాంతం పల్నాడు. అయితే.. ఎంత పౌరుషం ఉన్నా.. ఎవరూ ఎప్పుడు బాంబు లు వేసుకోలేదు. అరాచకాలకు పాల్పడలేదు. తమ గౌరవాన్ని ప్రాంతం గౌరవాన్ని కూడా నిలబెట్టారు. చరిత్ర లో ఈ ప్రాంతానికి పెద్ద పేరు తీసుకువచ్చారు. కానీ, తర్వాత.. రాజకీయాలు వచ్చి.. నగరాన్ని.. ఈ ప్రాంతాన్ని కూడా.. అరాచకాలకు కేంద్రంగా మార్చాయి. గత 20 ఏళ్లలో ఇక్కడ అరాచకం పెచ్చరిల్లిందనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఈవీఎంల ధ్వంసం.. ఘటనలు.. దేశవ్యాప్తంగా పల్నాడు పేరును మరోసారి.. తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో నాటిపల్నాడే బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిల్లూరు :
నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రశస్తి ఉంది. ఒకప్పుడు రాజులు పాలించిన ఈ నగరం అభివృద్ధిలో దూసుకుపో యింది. వెంకటగిరి రాజులు.. నగరాన్ని ఎంతో అభివృద్ది చేశారు. సాగు, ఎగుమతులకు కూడా నెల్లూరు అంటే.. ప్రత్యేకమైన పేరు ఉంది. కానీ, రానురాను..ఇక్కడ నాయకుల ప్రాబల్యం పెరిగి.. రాజకీయాలు వికృతంగా తయారయ్యాయి. మహిళలకు ఎంతో విలువ ఇచ్చిన నెల్లూరు నగరంలో ఇప్పుడు మహిళలకు భద్రత లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. అభివృద్ధికి కేరాఫ్గా ఒకప్పుడు విలసిల్లిన నెల్లూరు ఇప్పుడు ఎటు చూసినా.. అభివృద్ది లేక అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. నేతల ఆధిపత్య పోరాట.. పేదల ఆకలి పోరాటంతో నెల్లూరు నానాటికీ కునారిల్లు తుండడం గమనార్హం.
చెత్త చెత్త చిత్తూరు :
చిత్తూరు అంటే.. వెంటనే రెండు కీలక దేవస్థానాలు గుర్తుకు వస్తాయి. వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి, తిరుమల శ్రీవారు. ఈ రెండు ఆలయాలు ప్రపంచ స్థాయి ప్రసిద్ధి పొందాయి. ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్ర మైన.. చిత్తూరులో ఇప్పుడు ఎటు చూసినా.. రాజకీయ అరాచకానికి.. అకృత్యాలకు కేంద్రంగా మారింది. పైగా.. ఎవరి వారు ప్రజలను దోచుకునేవారు కనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు చంద్రగిరి మహారాజులు తమ తమ ప్రాంతాలనుఅభివృద్ది చేస్తే.. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాలను వ్యాపార కేంద్రాలుగా.. ఆధిపత్య రాజకీయాలకు అడ్డాగా చేసుకుని.. అభివృద్ధిమాట ఎత్తకుండా.. ముందుకు సాగుతుండడం గమనార్హం.
గోదా ' రాళ్లే ' :
నిండు గోదావరి ప్రవహించే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఒకప్పుడు పసిడి వన్నెలు అద్దుకున్నట్టు పచ్చగా కనిపించేవి. ఎటు చూసినా.. పొలాలు.. నవ్వుతున్న నిండు ముత్తయిదువు మాదిరిగా కనిపించేవి. కానీ, ఇప్పుడు సస్యశ్యామలమైన గోదావరి ప్రాంతాలు.. పందేలు. జూదాలకు అడ్డాగా మారిపోయాయి. పేకాటలు.. క్లబ్బులు.. ఇతర త్రా ఆగడాలకు కేంద్రంగా మారాయి. మరోవైపు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనితీరు ఎక్కడిదక్కడే అన్నట్టుగా ఉంది. దీంతో గోదావరి జిల్లాల పరిస్థితి గోదారాళ్లే! అన్నట్టుగా తయా రైంది. ఎటు చూసినా.. ఎలాంటి అభివృద్ధి లేని కోనసీమ కూడా వెక్కి రిస్తున్నట్టు కనిపిస్తుండడం గమనార్హం.
' రాళ్ల ' సీమే :
అంగళ్ల రతనాలు అమ్మిన.. రాయల సీమలో ఇప్పుడు కరువు కాటకాలు తప్ప.. రత్నాలు..కనిపించడం.. లేదు. వాటి స్థానంలో రాళ్లు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోయి.. రైతులు కూలీలుగా మారిపోయారు. చాలా ప్రాంతాల్లో సాగునీరు ఇప్పటికీ లేదు. తాగు నీటికోసం.. కిలో మీటర్ల దూరం తరలిపోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు భాగంగా ఉన్న రాయల సీమ.. ఓ వెలుగు వెలిగింది. ఇక్కడి రాగి సంగటి.. ఆంధ్రమాత (గోంగూర) కూరలకు ఉన్న ప్రసిద్ధి అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పొట్ట కూటికోసం.. ఇక్కడివారు వలస పోతున్న పరిస్థితిస్పష్టంగా కనిపిస్తోంది.